మూగ‌బోయిన బీజేపీ కంచు కంఠం

అస‌లే ఎన్నికల స‌మ‌యం.. ఏ పుట్ట‌లో ఏ పాముందో అన్న‌ట్టుగా అన్ని పార్టీల‌కు చోటా నుంచి మోటా వ‌ర‌కు నేత‌లంద‌రితోనూ ప‌ని ఉంటుంది. ఇక‌, నోరేసుకుని ప్ర‌తిప‌క్షాల‌పై ప్ర‌తాపం చూపించేవారితో అయితే.. మ‌రింత ప‌నిఖాయం. ఎన్నిక‌ల స‌మ‌యంలో పార్టీలకు కావాల్సింది కూడా ఇదే. అయితే.. అనూహ్యంగా బీజేపీ ఒక కీల‌క నేత‌ను ప‌క్క‌న పెట్టేసింది. ఆయ‌న నోరు విప్పితే విమ‌ర్శ‌ల వ‌ర్షం.. మాట్లాడితే తూటాలు.. అన్న‌ట్టుగా పేరొందిన నాయ‌కుడే ఘోషామ‌హ‌ల్ ఎమ్మెల్యే, పొలిటిక‌ల్ ఫైర్ బ్రాండ్ రాజా సింగ్‌. గ‌త ఆరు మాసాల కింద‌ట ఆయ‌న చేసిన వివాదాస్ప‌ద వ్యాఖ్య‌ల నేప‌థ్యంలో బీజేపీ ఆయ‌న‌పై స‌స్పెన్ష‌న్ వేటు వేసింది.

అయితే, అప్ప‌ట్లోనే రాజా సింగ్‌పై స‌స్పెన్ష‌న్ ఎత్తేస్తార‌ని, ఆయ‌న సేవ‌లు వినియోగించుకుంటార‌ని పెద్ద ఎత్తున ప్ర‌చారం జ‌రిగినా.. ఇప్ప‌టి వ‌ర‌కు బీజేపీ రాజా సింగ్‌పై ఎలాంటి క‌నిక‌రం చూప‌లేదు. దీంతో ఇప్పుడు కీల‌క‌మైన తెలంగాణ అసెంబ్లీ ఎన్నిక‌ల ముంగిట‌.. రాజా సింగ్ కంచు కంఠం మూగ‌బోయిన‌ట్టు మారిపోయింది. అంతేకాదు.. ఆయ‌న‌కు టికెట్ కూడా ఇచ్చే ప‌రిస్థితి ఉందా? లేదా? అనే విష‌యంపైనా రాజా అభిమానులు త‌ల్లడిల్లుతున్నారు. అయితే, ఈ విష‌యంపై రాజా సింగ్ మౌనంగానే చూస్తుండి పోయారు.

త‌న‌కు ఎన్నిక‌ల స‌మ‌యంలో ఊర‌ట ల‌భిస్తుందని రాజా సింగ్ ఆశాభావంతో ఉన్నారు. ఎన్నిక‌ల నామినేష‌న్‌కు స‌మ‌యం ఇంకా ఉన్నందున అప్ప‌టిలోగా త‌నపై బీజేపీ విధించిన స‌స్పెన్ష‌న్‌ను తొల‌గిస్తార‌ని భావిస్తున్నారు. ఒక‌వేళ స‌స్పెన్ష‌న్ తొల‌గించ‌కుండా, త‌న‌కు టికెట్ ఇవ్వ‌కుండా ఉన్న‌ప్ప‌టికీ.. త‌న పంథా మార‌బోద‌ని, ఏ పార్టీలోనూ చేరేది లేద‌ని రాజా సింగ్ వ్యాఖ్యానించారు. అంతేకాదు… త‌న స్థానంలో ఇత‌ర నేత‌ల‌కు అవ‌కాశం ఇచ్చినా.. తాను వారి గెలుపు కోసం శ్ర‌మిస్తాన‌ని, పార్టీ గెలుపు ముఖ్య‌మని రాజా సింగ్ వ్యాఖ్యానించారు.

“బీజేపీ జాతీయ, రాష్ట్ర నేతల మద్దతు నాకుంది. సస్పెన్షన్ ఎత్తివేయకుంటే ఇండిపెండెంట్‌గా పోటీచేసే ప్రసక్తే లేదు. టికెట్ రాకపోతే హిందూ ధర్మం కోసం పనిచేసుకుంటాను. అంతేకానీ, పార్టి నిర్ణ‌యానికి ఎదురు వెళ్లే ప్ర‌స‌క్తి లేదు” అని రాజా సింగ్ వ్యాఖ్యానించ‌డం గ‌మ‌నార్హం. అయితే, కీల‌క‌మైన ఎన్నిక‌ల స‌మ‌యంలో రాజాసింగ్ వంటి ఫైర్ బ్రాండ్‌ను పార్టీ దూరం చేసుకోవ‌డం మంచిది కాద‌ని విశ్లేష‌కులు అభిప్రాయ‌ప‌డుతున్నారు.