తెలంగాణలో పక్కా ప్లాన్ తో రాహుల్, ప్రియాంక

కాంగ్రెస్ అగ్రనేతలు తెలంగాణ ఎన్నికలపై ప్రత్యేక దృష్టి పెట్టినట్లే ఉన్నారు. గట్టి ఎఫర్టుపెడితే పార్టీ అధికారంలోకి వచ్చేయటం ఖాయమనే సర్వే రిపోర్టులతో పార్టీ సీనియర్లతో పాటు అగ్రనేతల్లో కూడా మంచి ఊపు కనబడుతోంది. ఎన్నికల షెడ్యూల్ విడుదలైన నేపధ్యంలో ఈనెల 15వ తేదీనుండి రాష్ట్రంలో బస్సుయాత్ర మొదలుపెట్టాలని పార్టీ డిసైడ్ చేసింది. మొత్తం 119 నియోజకవర్గాల్లో బస్సుయాత్ర చేయాలని, అందులో సీనియర్లతో పాటు ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, బీసీ నేతలుండేట్లుగా పార్టీ చర్యలు తీసుకున్నది.

15వ తేదీన మొదలయ్యే యాత్రలో రెండు రోజుల పాటు ప్రియాంక గాంధీ పాల్గొంటారు. యాత్రను ప్రారంభిస్తున్న ప్రియాంక రెండు రోజులు బస్సులో యాత్ర చేయబోతున్నారు. ఈ రెండు రోజుల్లో రెండుమూడు రోడ్డుషోలను కూడా నిర్వహించబోతున్నారు. అంటే రోడ్డు షోల్లో ప్రియాంక మాట్లాడుతారని పార్టీవర్గాల సమాచారం. ఇక 18,19 తేదీల్లో రాహుల్ రాబోతున్నారు. రాహుల్ కూడా రెండురోజులు బస్సుయాత్రలో పాల్గొంటారు. మళ్ళీ రోడ్డుషోలు, స్పీచులుంటాయి.

వీళ్ళిద్దరి యాత్రలు అయిపోయిన తర్వాత 20,21 తేదీల్లో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే కూడా రెండురోజులు బస్సుయాత్రలో పాల్గొనబోతున్నారు. బస్సుయత్ర పూర్తయ్యే లోపు ఇంకెంతమంది అగ్రనేతలు యాత్రల్లో పాల్గొంటారో తెలీదు. మొత్తానికి ఇక్కడ అర్ధమవుతున్నది ఏమిటంటే ప్రియాంక, రాహుల్ తెలంగాణాపై ప్రత్యేక దృష్టిపెట్టారని. మొన్నటి కర్నాటక ఎన్నికల్లో కూడా ప్రియాంక, రాహుల్ పదేపదే అక్కడ పర్యటించారు. పర్యటించటమే కాకుండా రోడ్డుషోలు, బహిరంగసభల్లో కూడా పాల్గొన్నారు.

ఇపుడు ప్రియాంక, రాహుల్ ఇపుడు రాజకీయాల్లో చూపిస్తున్న చొరవ గతంలో ఎప్పుడూ చూపిందిలేదు. ఏ రాష్ట్రంలో ఎన్నికనైనా రాహుల్ చాలా తేలిగ్గా తీసుకునే వారు. చివరకు ఉత్తరప్రదేశ్ లో తాను పోటీచేసిన అమేథీ పార్లమెంటు ఎన్నికల్లో కూడా ఓడిపోవటానికి కూడా నిర్లక్ష్యమే కారణం. ఒక్కసారి ప్రచారం చేస్తే గెలిచే నియోజకవర్గంలో అసలు రాహుల్ తొంగికూడా చూడలేదు. తర్వాత జరిగిన బీహార్, అస్సాం, పశ్చిమబెంగాల్ ఎన్నికల్లో కూడా పెద్దగా పాల్గొనలేదు. అలాంటిది ఇపుడు తెలంగాణాలో ఇన్నిసార్లు పర్యటించటం, బాగా నేతలు, జనాలతో మమేకం అవ్వటం మంచిదే కదా ?