ఎవరు? ఎప్పుడు? ఏ పార్టీలో చేరునో?

తెలంగాణ ఎన్నికల వేడి మొదలైంది. రెండు రోజుల క్రితం ఓ నాయకుడు ప్రచారం కోసం ఓ గ్రామానికి వెళ్లారు. తమ పార్టీకే ఓటు వేయాలని ప్రజలను కోరారు. ఇప్పుడు మరోసారి ఆ గ్రామానికి వెళ్లారు. కానీ ఇప్పుడు మెడలో కండువా వేరు. చేతిలో జెండా వేరు. పార్టీ వేరు. ఎందుకంటే ఆ నాయకుడు మరో పార్టీలోకి మారిపోయారు. గతంలో పొగిడిన పార్టీని ఇప్పుడు తిడుతూ.. కొత్తగా చేరిన పార్టీకి ఓట్లు వేయాలని కోరుతున్నారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో రాష్ట్రంలో మారుతున్న రాజకీయ సమీకరణాలు, పార్టీ జంపింగ్ లకు ఈ ఉదంతమే నిదర్శనం.

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు సమయం ఆసన్నమవుతోంది. త్వరలోనే షెడ్యూల్ వెల్లడించే ఆస్కారముంది. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే పదవి మీద ఆశతో ఉన్న నాయకులు టికెట్ల కోసం, చిన్న స్థాయి నాయకులు మంచి ప్రాధాన్యత కోసం పార్టీలు మారుతున్నారు. ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో పార్టీ జంపింగ్ ల ట్రెండే నడుస్తుందని చెప్పొచ్చు. ఒక రోజు ఒక పార్టీలో కనిపించే నాయకుడు.. తర్వాతి రోజు మరో పార్టీలో కనిపిస్తున్నారు. టికెట్ల ఆశతో పార్టీలు మారుతున్న నాయకులు చాలా మందే ఉన్నారు.

బీఆర్ఎస్లో ప్రాధాన్యత దక్కడం లేదని పొంగులేటి శ్రీనివాస రెడ్డి, జూపల్లి క్రిష్ణారావు కాంగ్రెస్ లోకి వెళ్లిపోయారు. టికెట్ ఆశించి భంగపడ్డ తుమ్మల నాగేశ్వర రావు, తనకు టికెట్ దక్కినా కొడుక్కి రాలేదని కారణంతో మైనంపల్లి హన్మంతరావు హస్తం గూటికి చేరారు. ఇంకా బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లోకి చేరిన, చేరుతున్న నాయకుల జాబితా పెద్దదిగానే ఉంది. ఇక మైనంపల్లి రాకతో మెదక్, మేడ్చల్ జిల్లాల కాంగ్రెస్ అధ్యక్షులు బీఆర్ఎస్ లోకి వెళ్లిపోయారు. ఇక బీజేపీలో పట్టించుకోవడం లేదనే నిరాశతో ఉన్న కొంతమంది కీలక నాయకులు కాంగ్రెస్ గూటికి చేరేందుకు సిద్ధమవుతున్నారనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. మొత్తం మీద ఇప్పుడు జంపింగ్ ల హవా నడుస్తోందని చెప్పొచ్చు. ఏ పార్టీ ఎక్కడ ఏ సమావేశం పెట్టినా అక్కడికి వచ్చిన వాళ్లకు కండువాలు కప్పడం పార్టీలో చేర్చుకోవడం కామన్ గా మారిపోయింది.