కేసీఆర్ ఆరోగ్యం కేటీఆర్ కు పట్టదన్న డీకే అరుణ

సీఎం కేసీఆర్ ఆరోగ్యం పై బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ సంచలన కామెంట్లు చేశారు. కేసీఆర్ ఆరోగ్యం బాగోలేదని వార్తలు వస్తున్నాయని, అవి అందరినీ ఆందోళనకు గురిచేస్తున్నాయని అరుణ చెప్పారు. కేసీఆర్ ను ఒక్కసారన్నా చూపించాలని ఇటీవల బండి సంజయ్ కూడా డిమాండ్ చేసిన సంగతి తెలిసిందే. ఆరోపణలకు తగ్గట్టుగానే కొద్ది రోజులుగా కేసీఆర్ కూడా మీడియాకు దూరంగా ఉంటున్నారు. ఈ నేపథ్యంలోనే కేసీఆర్ ఆరోగ్యంపై అరుణ కూడా సంచలన వ్యాఖ్యలు చేశారు.

సీఎం కావాలని ఆశతో కేసీఆర్ ను నిర్లక్ష్యం చేయొద్దు అంటూ కేటీఆర్ కు అరుణ హితవు పలికారు. కేసీఆర్ ఆరోగ్యంపై జాగ్రత్తలు తీసుకోవాలని అన్నారు. తండ్రి ఆరోగ్యం గురించి ఆందోళన చెందకుండా సీఎం కావాలన్న తపన కేటీఆర్ లో కనిపిస్తుందని విమర్శించారు. పనులు పూర్తి కాకుండానే ప్రారంభోత్సవాలు చేస్తూ బావబామ్మర్దులు కేటీఆర్, హరీష్ రావులు బిజీగా ఉన్నారని ఎద్దేవా చేశారు. పెద్దాయనను ఫామ్ హౌస్ లో పడుకోబెట్టి వీరిద్దరూ పరుగులు పెడుతున్నారని ఆరోపించారు. ఇక, కేసీఆర్ కు సన్నిహితుడైన ఎంపీ సంతోష్ కుమార్ ని కూడా దూరం పెడుతున్నారని ఆరోపించారు.

మరోవైపు, డీకే అరుణ, మాజీ ఎమ్మెల్సీ రామచంద్రరావుల సమక్షంలో చికోటి ప్రవీణ్ బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. తిరుణాలలో తప్పిపోయిన పిల్లవాడు తల్లి చెంతకు చేరినట్టుగా బిజెపిలో చేరగానే తనకనిపిస్తోందని ప్రవీణ్ అన్నారు. కొద్దిరోజుల కిందటే బిజెపిలో చేరాల్సి ఉందని, సమాచారం లోపం వల్ల కొంత వాయిదా పడిందని అన్నారు. బిజెపిని బలోపేతం చేసేందుకు కృషి చేస్తానని, రాబోయే ఎన్నికల్లో బిజెపిదే అధికారం అని అన్నారు.

కాగా, కేసినో వ్యవహారాల నేపథ్యంలో చికోటి ప్రవీణ్ పేరు ఒక్కసారిగా వార్తల్లో నిలిచిన సంగతి తెలిసిందే. అయితే, చికోటి ప్రవీణ్ బిజెపిలో చేరబోతున్నారని కొంతకాలంగా ప్రచారం జరుగుతుంది. ఆ కార్యక్రమానికి కొద్దిరోజుల క్రితం ఏర్పాట్లు కూడా పూర్తయ్యాయి. కానీ, చివరి నిమిషంలో బిజెపి హై కమాండ్ బ్రేక్ వేయడంతో ప్రవీణ్ బిజెపి తీర్థం పుచ్చుకునే కార్యక్రమం పెండింగ్లో పడిందని ప్రచారం జరిగింది. తాజాగా, చికోటి ప్రవీణ్ చేరికకు బిజెపి పెద్దలు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ఈరోజు చికోటి ప్రవీణ్ బిజెపి కండువా కప్పుకున్నారు.