వీళ్ళు డిసైడ్ అయిపోయారా ?

తెలంగాణా బీజేపీ నాయకత్వాన్ని ధిక్కరించటానికి నలుగురు నేతలు డిసైడ్ అయినట్లే అనుమానంగా ఉంది. అందుకనే కేంద్ర మంత్రి, పార్టీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి అధ్యక్షతన జరిగిన పదాధికారుల సమావేశానికి నలుగురు నేతలు కోమటిరెడ్డి రాజగోపాలరెడ్డి, కొండా విశ్వేశ్వర్ రెడ్డి, విజయశాంతి, ఏనుగు రవీంద్రనాధరెడ్డి గైర్హాజరయ్యారు. వీళ్ళు నలుగురు మొన్నటి నరేంద్ర మోదీ పర్యటనలో కూడా కనబడలేదు. పార్టీ మీటింగులకు కూడా పెద్దగా హాజరుకావటంలేదు. ఈ నలుగురి సమస్య ఏమిటో పార్టీ నేతలకు అర్ధంకావటంలేదు.

బండి సంజయ్ అధ్యక్షునిగా ఉన్నంతవరకు వీళ్ళు కాస్త యాక్టివ్ గానే ఉండేవారు. కిషన్ అధ్యక్షుడిగా బాధ్యతలు తీసుకున్న తర్వాత మాత్రమే వీళ్ళ వ్యవహారశైలిలో మార్పొచ్చేసింది. పదాదికారుల సమావేశం అంటే పార్టీలో కీలకమైన సమావేశమనే చెప్పాలి. పైగా ఏనుగు తప్ప మిగిలిన ముగ్గురు తాజాగా వేసిన 14 ఎన్నికల కమిటీల్లో ఉన్నారు. పార్టీపరంగా వీళ్ళకి బాగానే ప్రధాన్యత దక్కుతున్నదనే చెప్పాలి. అయినా వీళ్ళు అసంతృప్తిగా ఉన్నారంటేనే కారణాలు ఏమిటో అర్ధంకావటం లేదు.

ఈ అసంతృప్త నేతలకు రాబోయే ఎన్నికల్లో టికెట్లు కూడా గ్యారెంటీ అని అర్ధమవుతోంది. ఇపుడు పదవులూ దక్కాయి, రేపటి ఎన్నికల్లో టికెట్లూ గ్యారెంటీనే అయినా ఎందుకు అసంతృప్తి ? అన్నదే అర్ధంకావటంలేదు. ఏరోజుకారోజు వీళ్ళు పార్టీ మారటం ఖాయమనే ప్రచారం బాగా పెరిగిపోతోంది. ఇప్పటికే కోమటిరెడ్డి రాజగోపాలరెడ్డికి భువనగిరి ఎంపీగా కానీ లేదా మునుగోడు ఎంఎల్ఏగా కాని కాంగ్రెస్ లో టికెట్ ఇప్పించేందుకు సోదరుడు, భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గట్టిగా ప్రయత్నిస్తున్నారనే ప్రచారం అందరికీ తెలిసిందే.

ఏదేమైనా ఈ నలుగురి వ్యవహార శైలి పార్టీలో హాట్ టాపిక్ అయిపోయింది. ఈ అసంతృప్త నేతల బాటలోనే ఇంకా ఎంతమంది నేతలు నడవటానికి రెడీగా ఉన్నారో తెలీటంలేదు. ఎక్కడిక్కడ మీటింగులు పెట్టుకుని కిషన్ కు వ్యతిరేకంగా మాట్లాడుకుంటున్నారు. విచిత్రం ఏమిటంటే కిషన్ పైన వ్యతిరేకంగా చివరకు మోడీ మీటింగులకు కూడా గైర్హాజరయ్యారంటేనే అసంతృప్తి ఎంత తీవ్రంగా ఉందో అర్ధమైపోతోంది. మరి చివరకు వీళ్ళు ఏమిచేస్తారో నాయకత్వానికి అర్ధమే కావటంలేదు.