లిక్కర్ స్కామ్ లో కీలక పరిణామం

ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో కీలక పరిణామం చోటుచేసుకుంది. అదేమిటంటే అప్రూవర్ గా మారడానికి రౌస్ ఎవెన్యూ కోర్టు మాగుంట రాఘవరెడ్డికి అనుమతిచ్చింది. లిక్కర్ స్కాం లో తాను అప్రూవర్ గా మారాలని అనుకుంటున్నానని అందుకు అనుమతించాలని రాఘవ కోర్టులో దరఖాస్తు చేసుకున్నారు. ఈ దరఖాస్తును పరిశీలించిన కోర్టు అందుకు అనుమతించింది. మాగుంట రాఘవ అంటే ఒంగోలు వైసీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి కొడుకన్న విషయం అందరికీ తెలిసిందే.

దశాబ్దాలుగా లిక్కర్ వ్యాపారంలోనే ఉన్న మాగుంట ఫ్యామిలి మొదటిసారి స్కామ్ లో ఇరుక్కుని అరెస్టయ్యింది. స్కామ్ లో ఎమౌంట్ చిన్నదే అయినా ఇందులో ఇన్వాల్వ్ అయిన వ్యక్తుల కారణంగా స్కామ్ దేశంలో సంచలనం సృష్టించింది. ఢిల్లీలో ఆప్ ప్రభుత్వంలో ఉపముఖ్యమంత్రి మనీష్ సిసోడియా తో పాటు మంత్రి సత్యేంద్ర జైన్ కూడా చాలాకాలంగా జైలులోనే ఉన్నారు. అరబిందో ఫార్మా ఎండీ శరత్ చంద్రారెడ్డితో పాటు చాలామందిని ఈడీ విచారించి అరెస్టు చేసింది.

ఇదే కేసులో సౌత్ గ్రూప్ తరపున తెలంగాణ సీఎం కేసీఆర్ కూతురు కల్వకుంట్ల కవిత కూడా కీలకపాత్ర దారుగా ఈడీ రిమాండు రిపోర్టుతో పాటు చార్జిషీట్లలో కూడా కోర్టుకు చెప్పింది. కవితకు బినామీలుగా ప్రచారంలో ఉన్న రాజన్ పిళ్ళై తదితరులు కూడా అరెస్టయి జైలులోనే ఉన్నారు. స్కామ్ లో చాలామంది పాత్రదారులు ఒక్కొక్కళ్ళుగా అప్రూవర్లుగా మారిపోతున్నారు. ఎంతమంది అరెస్టయినా, ఎంతమంది బెయిల్ తెచ్చుకున్నా, అప్రూవర్లుగా మారినా కవిత పాత్రపైన బాగా వివాదం కంటిన్యూ అవుతోంది.

ఎందుకంటే స్కామ్ లో పాత్రదారులని ఇంతమందిని అరెస్టు చేసిన ఈడీ కవితను నాలుగుసార్లు విచారించినా ఎందుకని అరెస్టు చేయలేదన్నది కీలకమైన పాయింట్. కవిత అరెస్టు తప్పదని విచారణలో బాగా ప్రచారం జరిగిన విషయం తెలిసిందే. కవిత అరెస్టు ఖాయమని పార్టీ మీటింగులో కేసీయార్ కూడా ప్రకటించారు. అయినా కవిత అరెస్టు ఇంతవరకు జరగలేదు. మరి అప్రూవర్లుగా మారిపోయిన వాళ్ళు ఇచ్చే వాంగ్మూలాల ఆధారంగా కవితను అరెస్టు చేయాలని ఈడీ అనుకుంటోందా అన్నది అర్ధంకావటం లేదు. చివరకు ఏమవుతుందో చూడాల్సిందే.