అక్టోబరు 2న భువనేశ్వరి నిరాహార దీక్ష

టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్ట్ తర్వాత ఆయన సతీమణి నారా భువనేశ్వరితోపాటు కోడలు నారా బ్రాహ్మణి కూడా యాక్టివ్ పాలిటిక్స్ లోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. చంద్రబాబుకు మద్దతుగా చేపట్టిన పలు నిరసన కార్యక్రమాలలో అత్తాకోడళ్లు చురుగ్గా పాల్గొని ప్రభుత్వంపై పదునైన విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా చంద్రబాబు అరెస్టుకు నిరసనగా భువనేశ్వరి అక్టోబరు 2న నిరాహార దీక్ష చేపట్టబోతున్నట్లు ఏపీ టీడీపీ అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు వెల్లడించారు. అక్టోబరు 2వ తేదీ రాత్రి 7 గంటల నుంచి 7.05 వరకు 5 నిమిషాలపాటు ప్రతి ఇంట్లోనూ లైట్లు ఆపేసి బయటికి వచ్చి కొవ్వొత్తులు వెలిగించి చంద్రబాబు అరెస్ట్ ను ఖండించాలని అచ్చెన్న పిలుపునిచ్చారు.

నంద్యాలల జరిగిన పార్టీ మీటింగ్ లో అచ్చెన్న పలు వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు అరెస్ట్ తట్టుకోలేక 97 మంది చనిపోయినట్లు తెలిసిందని, వారికి సంతాపం తెలిపామని అచ్చెన్న అన్నారు. త్వరలోనే టీడీపీ, జనసేన జేఏసీ రూపుదిద్దుకుంటుందని, ఆ తర్వాత పోరాటం ఉద్ధృతం చేస్తామని చెప్పారు. రాష్ట్రస్థాయిలో ఆ జేఏసీ ఉంటుందని, ఇక నుంచి ప్రభుత్వానికి వ్యతిరేకంగా జరిగే ప్రతి కార్యక్రమంలో జనసేనతో సమన్వయం చేసుకొని టీడీపీ ముందుకు పోతుందని అన్నారు.

మరోవైపు, ఈ రోజు టీడీపీ చేపట్టిన మోత మోగిద్దాం కార్యక్రమానికి జనసేన మద్దతు తెలిపింది. ఆ కార్యక్రమంలో జనసైనికులు పాల్గొని విజయవంతం చేయాలని జనసేన పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ పిలుపునిచ్చారు. వారాహి యాత్రకు మద్దతు తెలిపిన టీడీపీకి ధన్యవాదాలు చెప్పారు. కృష్ణా జిల్లా అవనిగడ్డలో బహిరంగ సభతో మొదలయ్యే వారాహి యాత్ర అక్టోబర్ 1 నుంచి 5 రోజుల పాటు ఖరారైందని తెలిపారు.