తెలంగాణకు ఏమైంది? రెండో రోజు భారీగా కేసులు నమోదు

తెలంగాణకు ఇరుగుపొరుగున ఉన్న మహారాష్ట్ర.. ఆంధ్రప్రదేశ్.. కర్ణాటక రాష్ట్రాల్లో కరోనా కేసులు భారీగా నమోదు కావటం తెలిసిందే. దేశంలో అత్యధిక కేసుల నమోదులో మహారాష్ట్ర మొదటిస్థానంలో ఉండగా.. రెండో స్థానంలో ఆంధ్రప్రదేశ్.. మూడో స్థానంలో కర్ణాటక రాష్ట్రాలు ఉన్నాయి. ఈ మూడు రాష్ట్రాలు తెలంగాణకు సరిహద్దు రాష్ట్రాలుగా ఉండటం గమనార్హం. అయినప్పటికీ.. ఈ మూడు రాష్ట్రాలతో పోలిస్తే.. తెలంగాణలో కేసుల నమోదు తక్కువగా ఉండేది.

దీంతో.. కాస్తంత మెరుగ్గా ఉందనుకుంటున్న పరిస్థితికి భిన్నంగా గడిచిన మూడు రోజులుగా చోటు చేసుకుంటున్న పరిణామాలు ఇబ్బందికరంగా మారుతున్నాయి. వరుసగా రెండు రోజుల పాటు తెలంగాణలో పాజిటివ్ కేసుల నమోదు అంతకంతకూ పెరుగుతోంది. ఈ రోజు విడుదల చేసిన బులిటెన్ చూస్తే.. కేసుల సంఖ్య 2384కు చేరటం ఆందోళన కలిగించే అంశంగా చెప్పాలి. మొన్నటివరకు తక్కువగా నమోదైన కేసులు.. తాజాగా మాత్రం అందుకు భిన్నంగా పెరగటం గమనార్హం.

వినాయకచవితి సందర్భంగా తెలంగాణ వ్యాప్తంగా వీధుల్లో పెద్ద ఎత్తున రద్దీ నెలకొంది. ఒక విధంగా చెప్పాలంటే.. లాక్ డౌన్ తర్వాత.. వీధులు ఇంత రద్దీగా.. జనసమ్మర్థంతో ఉండిపోవటం ఇప్పుడేనని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో వచ్చే పది రోజుల్లో వినాయకచవితి ఎఫెక్టు అంతో ఇంతో కొత్త కేసులకు అవకాశం ఇస్తుందని చెప్పక తప్పదు. దీనికి ముందే..కేసుల నమోదు అంతకంతకూ పెరుగుతూ కొత్త టెన్షన్ ను తెస్తున్నాయి.

తాజాగా విడుదల చేసిన బులిటెన్ ప్రకారం కేసుల సంఖ్య పెరుగుతున్నా.. మరణాల సంఖ్య మాత్రం పెద్దగా మార్పు లేదనే చెప్పాలి. గడిచిన 24 గంటల్లో తెలంగాణ వ్యాప్తంగా 11 మంది మరణించినట్లుగా నివేదికలో పేర్కొన్నారు. అదే సమయంలో రికవరీ అయిన వారు 1851 మందిగా చెబుతున్నారు. దీంతో.. ఇప్పటివరకు కోలుకున్న వారు 80,586 మంది కాగా.. ప్రస్తుతం యాక్టివ్ కేసులు 22,908గా ఉన్నట్లు పేర్కొన్నారు. ఎప్పటిలానే కేసుల నమోదులో గ్రేటర్ హైదరాబాద్ మొదటిస్థానంలో నిలిచింది. ఇటీవల నమోదైన కేసులతో పోలిస్తే.. తాజాగా కాస్త ఎక్కువే నమోదయ్యాయి.

జీహెచ్ఎంసీలో 472 పాజిటివ్ లు తేలితే.. రెండో స్థానంలో నిజామాబాద్ (148).. మూడో స్థానంలో నల్గొండ (137).. నాలుగో స్థానంలో రంగారెడ్డి (131).. ఐదో స్థానంలో కరీంనగర్ (120) నిలిచాయి. వందకు పైగా నమోదైన జిల్లాల విషయానికి వస్తే.. సూర్యాపేట (110).. ఖమ్మం (105).. జగిత్యాల (105) నమోదయ్యాయి. రాష్ట్రంలోని 33 జిల్లాల్లోనూ కేసులు నమోదు కాగా.. అతి తక్కువ కేసులున్న జిల్లాగా జయశంకర్ భూపాలపల్లి నిలిచింది. ఈ జిల్లాలో కేవలం ఏడు కేసులు మాత్రమే నమోదయ్యాయి. తక్కువగా కేసులు నమోదైన జిల్లాల్లో కొమరంభీం ఆసిఫాబాద్ (12).. నారాయణపేట (13).. నిర్మల్ (19).. వికారాబాద్ (19).. ములుగు (19).. అదిలాబాద్ (25).. కేసులు నమోదయ్యాయి.