బీజేపీ ఫెయిలైందా ?

తెలంగాణాలో పరిస్ధితులను అడ్వాంటేజ్ తీసుకుని బలపడటంలో బీజేపీ ఫెయిలైందని పార్టీ సీనియర్ నేత, మాజీ ఎంపీ కొండా విశ్వశ్వరరెడ్డి కుండబద్దలు కొట్టారు. మీడియాతో కొండా మాట్లాడుతు పార్టీని బలోపేతం చేయటం కోసమే సీనియర్లంతా తరచూ సమావేశమై మాట్లాడుకుంటున్నట్లు చెప్పారు. కొంతకాలంగా పార్టీలోని ఓ పదిమంది సీనియర్లు తరచు కలుస్తున్నారు. ఇందులో మాజీ ఎంపీలు, మాజీ ఎంఎల్ఏలున్నారు. వీళ్ళంతా వ్యక్తిగతంగా తీసుకుంటే బాగా బలవంతులనే చెప్పాలి. తమ నియోజకవర్గాల్లో పట్టున్న నేతలే.

అయితే వీళ్ళ భేటీలు అధికారికం కావు. పార్టీ అధ్యక్షుడికి సంబంధంలేకుండా జరుగుతోంది. పైగా ప్రతి మీటింగు ప్లేసును ఎప్పటికప్పుడు మారుస్తున్నారు. దాంతో అధ్యక్షుడు కిషన్ రెడ్డికి వ్యతిరేకంగా జరుగుతున్న సమావేశాలుగా బాగా ప్రచారంలోకి వచ్చేశాయి. ఎందుకంటే వీళ్ళెవరు అధ్యక్షుడితో కానీ పార్టీలో ముఖ్యులతో కానీ కలవటంలేదు. డైరెక్టుగా పార్టీ అధ్యక్షుడు జేపీ నడ్డా, తెలంగాణా ఇన్చార్జి ప్రకాష్ జదవేవ్ కర్, సునీల్ బన్సల్ లాంటి వాళ్ళతోనే మాట్లాడుతున్నారు.

సీనియర్ల మీటింగులు పార్టీలో పెద్ద చర్చనీయాంశంగా మారింది. వీళ్ళంతా కిషన్ రెడ్డికి వ్యతిరేకంగా ప్రెషర్ గ్రూపుగా తయారయ్యారనే ప్రచారం పెరిగిపోతోంది. ఈ నేపధ్యంలోనే కొండా మీడియాతో మాట్లాడారు. పార్టీలో జరుగుతున్న విషయాలన్నింటినీ ఎప్పటికప్పుడు కేంద్ర నాయకత్వానికి చెబుతున్నట్లు చెప్పారు. కిషన్ తో కాకుండా నేరుగా ఢిల్లీ నాయకత్వంతో మాట్లాడుతున్నారంటేనే వీళ్ళంతా అధ్యక్షుడి వ్యతిరేక గ్రూపుగా అందరికీ అర్ధమవుతోంది. రాష్ట్రంలో కేసీయార్ ప్రభుత్వంపై జనాల్లో తీవ్రస్ధాయిలో వ్యతిరేకత ఉందన్నారు.

అయితే ఆ వ్యతిరేకతను అడ్వాంటేజ్ తీసుకోవటంలో బీజేపీ ఫెయిలైందని అంగీకరించారు. పార్టీ విధానాలపైన తమకు సందేహాలున్నట్లు చెప్పారు. వీటిని అమిత్ షా తో మాట్లాడి తీర్చుకోవాలని అనుకుంటున్నట్లు చెప్పారు. వచ్చేనెల 3వ తేదీన నిజామాబాద్, 6వ తేదీన మహబూబ్ నగర్లో నరేంద్రమోడీ బహిరంగసభలు జరుగబోతున్నాయన్నారు. ఈ సందర్భంగా అమిత్ షా కూడా వస్తే తామంతా భేటీ అవ్వాలని అనుకుంటున్నట్లు చెప్పారు. పనిలో పనిగా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో కూడా భేటీ ఉంటుందన్నారు. మొత్తానికి పార్టీలో ప్రెషర్ గ్రూపు బాగానే పనిచేస్తున్నట్లు అర్ధమవుతోంది. మరి చివరకు ఏమవుతుందో చూడాలి.