కేసీఆర్ కు షాకిచ్చిన తమిళిసై

తెలంగాణ సీఎం కేసీఆర్ వర్సెస్ తెలంగాణ గవర్నర్ తమిళిసై అన్నరీతిలో కొంతకాలంగా మాటళ యుద్ధం జరుగుతున్న సంగతి తెలిసిందే. గవర్నర్ పై బీఆర్ఎస్ నేతలు సందర్భానుసారంగా విమర్శలు గుప్పించడం, ఆ క్రమంలోనే బీఆర్ఎస్ నేతలపై కూడా గవర్నర్ ప్రతి విమర్శలు చేయడం తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. ఈ క్రమంలోనే ఇటీవల ఆర్టీసీ కార్మికుల విలీనం బిల్లుకు తమిళిసై బ్రేకులు వేయడంపై విమర్శలు వచ్చాయి. ఆ తర్వాత ఎట్టకేలకు ఆర్టీసీ బిల్లుకు గవర్నర్ ఆమోదం తెలపడంతో ఆ వివాదం సద్దుమణిగింది. ఈ క్రమంలోనే తాజాగా తమిళిసై మరో సంచలన నిర్ణయానికి తెరతీశారు.

గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీల జాబితాను తిరస్కరిస్తూ ఆమె సంచలన నిర్ణయం తీసుకున్నారు. గవర్నర్ కోటా కింద ఎమ్మెల్సీ అభ్యర్థులుగా దాసోజు శ్రవణ్ కుమార్, కుర్రా సత్యనారాయణలను ప్రభుత్వం ఎంపిక చేసి గవర్నర్ అనుమతి కోసం జాబితాను పంపించింది. కొద్దికాలంగా ఆ వ్యవహారాన్ని పెండింగ్లో పెట్టిన తమిళిసై తాజాగా దానిని తిరస్కరిస్తూ ప్రభుత్వానికి జవాబు ఇచ్చారు. ఆర్టికల్ 171(5) ప్రకారం అభ్యర్థుల ఎంపిక జరగలేదని, అందుకే తిరస్కరించానని గవర్నర్ అన్నారు. రాజకీయ నేతలను ప్రతిపాదిస్తే తిరస్కరిస్తానని తేల్చి చెబుతున్నారు. రాజకీయాలకు ఏ మాత్రం సంబంధం లేని వారి పేర్లను ప్రతిపాదించాలని సూచించారు.

సామాజిక, సేవా కార్యక్రమాల్లో ఆ ఇద్దరి పాత్ర గురించి ప్రస్తావించలేదని గవర్నర్ అన్నారు. వీటితోపాటు ఏయే కారణాల నేపథ్యంలో ఈ ఇద్దరిని తిరస్కరించాల్సి వచ్చిందో వెల్లడిస్తూ ప్రభుత్వానికి వేర్వేరు లేఖలను గవర్నర్ రాశారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కి ఈ లేఖలను తమిళసై పంపించారు. ఇక, జూలై 31న జరిగిన కేబినెట్ మీటింగ్ లో దాసోజు, సత్యనారాయణలను గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ పదవులకు ప్రభుత్వం నామినేట్ చేసిన సంగతి తెలిసిందే. పాడి కౌశిక్ రెడ్డి పేరును గవర్నమెంట్ కోటా ఎమ్మెల్సీకి రాష్ట్ర క్యాబినెట్ సిఫార్సు చేయగా దానిని గతంలో తమిళిసై తిరస్కరించారు. అప్పటినుంచి ప్రగతి భవన్, రాజ్ భవన్ ల మధ్య గ్యాప్ ఏర్పడింది. ఆ గ్యాప్ ఇప్పటికీ కొనసాగుతూనే ఉండగా తాజాగా అదే ఎమ్మెల్సీ కోటా వ్యవహారంపై నిర్ణయంతో గ్యాప్ మరింత పెరిగింది.