ఇక బాబు పై ఆ మరక చెరిగిపొయినట్టే

వ్యవస్థలను మేనేజ్ చేస్తాడు.. కోర్టులు ఆయన గుప్పెట్లో ఉంటాయి.. స్టేలు తెచ్చుకుని కేసులు ముందుకు సాగకుండా అడ్డం పడతాడు.. ఇలా తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు నాయుడు మీద వైరి పక్షాలు అనేక ఆరోపణలు చేస్తుంటాయి. వ్యవస్థల్ని మేనేజ్ చేస్తాడని ఆయన మీద ఎంతోమంది వ్యాఖ్యానాలు చేసి .. జనాల్లో కూడా ఆ అభిప్రాయం బలపడిపోయేలా చేశారు. కట్ చేస్తే ఇప్పుడు స్కిల్ డెవలప్మెంట్ కేసులో పరిణామాలు చూస్తుంటే ఈ ఆరోపణలు ఎంత వరకు నిజం అనే ప్రశ్న తలెత్తుతోంది.

ఇది చాలా చిన్న కేసు అని.. అసలు ఈ ఈ కేసులో అవినీతి జరిగినట్లు సరైన ఆధారాలే లేవని.. ఒకవేళ ఎక్కడైనా తప్పు జరిగినా.. పద్ధతి ప్రకారం అన్నీ చేసి కేబినెట్ ఆమోదంతో నిధుల విడుదలకు ఆమోదం తెలిపినంత మాత్రాన సీఎం దీనికి ఎలా బాధ్యత వహిస్తాడని జయప్రకాష్ నారాయణ లాంటి నిపుణులు ప్రశ్నిస్తున్నారు.

ఇలాంటి వ్యవహారాల్లో సీఎంను బాధ్యుడిని చేయాలంటే అసలు దేశంలో ప్రభుత్వాలే నడవవు అని ఆయన తేల్చేశారు. కేసు ఇంత స్పష్టంగా ఉన్నా సరే.. చంద్రబాబు ఈ కేసులో రిమాండ్‌లో గడపాల్సి వస్తోంది. ఆధారాలు లేకుండా కేసు పెట్టి.. విచారణ తర్వాత నిజాలు బయటికి తీస్తాం అంటోంది ప్రభుత్వం. చంద్రబాబు నిజంగా వ్యవస్థల్ని మేనేజ్ చేసేట్లయితే.. ఈ కేసులో ఆయన రిమాండుకు వెళ్లాల్సిన పనే ఉండేది కాదు. ఒకవేళ వెళ్లినా ఒకట్రెండు రోజుల్లో బయటికి వచ్చేసేవారే.

కానీ వారం తర్వాత కూడా బాబు ఇంకా జైల్లో ఉన్నారంటే ఆయన నిస్సహాయంగా ఉన్నట్లే. కేసులో పరిణామాలు చూస్తుంటే జగన్ అండ్ కోనే వ్యవస్థల్ని మేనేజ్ చేస్తున్నారేమో అన్న సందేహాలు బలంగా కలుగుతున్నాయి. ఈ కేసు వ్యవహారం చూశాక అయినా చంద్రబాబు వ్యవస్థల్ని మేనేజ్ చేస్తాడు అనే అపప్రథ తొలగిపోతుందేమో చూడాలి.