మా ఎమ్మెల్యే రౌడీషీట‌ర్‌… కేసీఆర్‌కు కార్పొరేట‌ర్ల లేఖ‌

గులాబీ ద‌ళ‌ప‌తి కేసీఆర్ ఊహించ‌ని రీతిలో ఆ పార్టీలోని అస‌మ్మ‌తి వ్య‌క్త‌మ‌వుతోంది. రాబోయే ఎన్నిక‌ల్లో సిట్టింగ్‌ల‌కే టికెట్లు అంటూ ఇటీవ‌ల బీఆర్ఎస్ పార్టీ ర‌థ‌సార‌థి, ముఖ్య‌మంత్రి కేసీఆర్ టికెట్లు కేటాయించిన సంగ‌తి తెలిసిందే. అలా కేటాయించిన సీట్ల‌లో ప‌లు చోట్ల ద్వితీయ శ్రేణి నేత‌లు త‌మ అస‌మ్మ‌తి వ్య‌క్తం చేస్తున్నారు. తాజాగా వరంగల్ జిల్లాకు చెందిన ఓ ఎమ్మెల్యే రౌడీ షీట‌ర్ వ‌లే వ్య‌వ‌హ‌రిస్తున్నార‌ని ఆయ‌న‌ టికెట్ ర‌ద్దు చేయాలంటూ గులాబీ పార్టీ కార్పొరేట‌ర్లు పార్టీ ర‌థ‌సార‌థి కేసీఆర్‌కు ఫిర్యాదు చేయ‌డం క‌ల‌క‌లంగా మారింది.

వరంగల్‌ తూర్పు ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్‌కు వ్యతిరేకంగా అధికార పార్టీకి చెందిన సుమారు 15 మంది కార్పోరేటర్లు రహస్యంగా సమావేశం నిర్వహించినట్లు తెలుస్తోంది. పార్టీ అధిష్టానం నన్నపునేని నరేందర్‌కు మరోసారి ఎమ్మెల్యే టికెట్ ప్ర‌క‌టించ‌డాన్ని వెన‌క్కు తీసుకోవాల‌ని, ఒక‌వేళ టికెట్ ఇస్తే ఎట్టి పరిస్థితుల్లో మద్దతు ఇవ్వబోమని కార్పోరేటర్లు నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఎమ్మెల్యే నరేందర్‌ బెదిరిస్తున్నట్లు, తమపై కేసులు పెడుతానని హెచ్చరిస్తున్నట్లు కార్పోరేటర్ల ర‌హ‌స్య చ‌ర్చ‌లో ప్ర‌స్తావ‌న‌కు వ‌చ్చిన‌ట్లు స‌మాచారం. ఒక‌వేళ పార్టీ అధిష్టానం తమపై ఒత్తిడి తీసుకువస్తే పార్టీ మారాల‌ని చ‌ర్చించుకున్న‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది. ఈ మేర‌కు ప‌లు కీల‌క అంశాల‌తో సీఎం కేసీఆర్‌కు, మంత్రులు కేటీఆర్‌, హరీష్‌ రావులతో పాటు ఎమ్మెల్సీ కవితకు ఫ్యాక్స్‌ ద్వారా తమ నిర్ణయాన్ని పంపించినట్లు స‌మాచారం.

వరంగల్‌ తూర్పు ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్‌కు వ్యతిరేకంగా పోరాటం చేద్దామని తీర్మానించుకున్నట్లు పార్టీ అధిష్టానానికి తెలిపినట్లు స‌మాచారం. ఎమ్మెల్యే రౌడీ షీటర్‌గా మారాడని, అనుచరులతో తమపై దాడికి ప్రయత్నం చేశార‌ని, మరోసారి ఆయన ఎమ్మెల్యేగా పోటీ చేస్తే నియోజకవర్గంలో బీఆర్‌ఎస్‌ గెలిచే అవకాశం లేదని ఫిర్యాదులో పేర్కొన్న‌ట్లు తెలుస్తోంది. 15 మంది కార్పొరేట‌ర్లు ఎమ్మెల్యేకు వ్య‌తిరేకంగా ఫిర్యాదు చేయ‌డంతో… పార్టీ అధిష్టానం కార్పోరేటర్ల లేఖకు స్పందించినట్లు తెలుస్తోంది. ఎమ్మెల్యేకు కార్పోరేటర్ల మధ్య ఎలాంటి వివాదాలు ఉన్నాయో తెలుసుకోవాల‌ని ప్రైవేట్ వ్యక్తులను కోరినట్లు సమాచారం. ఎమ్మెల్యే వ్య‌వ‌హార శైలిపై వివరణ ఇవ్వాలని, ఎమ్మెల్యే- కార్పోరేటర్ల మధ్య జ‌రిగిన వివాదాల‌ను, వరంగల్‌ తూర్పు నియోజకవర్గంలోని ఇత‌ర స‌మ‌స్య‌ల‌ను త‌మ దృష్టికి తీసుకురావాల‌ని అధిష్టానం పెద్దలు కోరిన‌ట్లు స‌మాచారం.

ఎన్నిక‌ల గ‌డువు స‌మీపిస్తున్న స‌మ‌యంలో బీఆర్‌ఎస్ సిటింగ్ ఎమ్మెల్యేకు, పార్టీ నేతలకు తెలియకుండా అధికార పార్టీకి చెందిన సుమారు 15 మంది కార్పోరేటర్లు రహస్యంగా సమావేశం నిర్వహించడం ఉమ్మ‌డి జిల్లాలో చ‌ర్చ‌నీయాంశంగా మారింది. సయోధ్య కుదుర్చాలని బీఆర్ఎస్ పెద్ద‌లు భావిస్తుండ‌గా…ఎమ్మెల్యేకు స‌హ‌క‌రించాల‌ని పార్టీ ఒత్తిడి చేస్తే, పార్టీ మారాల‌ని సైతం నిర్ణ‌యం తీసుకోవ‌డం ద్వారా వరంగల్‌లో బీఆర్‌ఎస్‌కు భారీ షాక్‌ తగలబోతున్నట్లు తెలుస్తోంది.