సీఎం జ‌గ‌న్‌కు సీపీఎస్ గండం.. 30 ల‌క్ష‌ల ఓట్లు ఎటువైపు?

ఒక‌టి కాదు రెండు కాదు.. ఏకంగా 30 ల‌క్ష‌ల ఓట్లు. ఒక పార్టీ అధికారంలోకి రావాలా.. వ‌ద్దా.. అని నిర్ణ‌యించే ఓటు బ్యాంకు. అధికారం చేప‌ట్టాల‌ని భావించే పార్టీకి ప్రాణ ప్ర‌ద‌మైన ఓటుబ్యాంకు.. ఇప్పుడు ఇదే ఓటు బ్యాంకు వైసీపీని వీడుతోంద‌నే చ‌ర్చ ఏపీలో జోరుగా సాగుతోంది. గ‌త ఎన్నిక‌ల స‌మ‌యంలో ప్ర‌భుత్వ ఉద్యోగుల‌(2004 త‌ర్వాత నియామ‌కం పొందిన‌) కంట్రిబ్యూట‌రీ పింఛ‌న్ స్కీం(సీపీఎస్‌)ను ర‌ద్దు చేస్తామ‌ని వైసీపీ అధినేత‌గా జ‌గ‌న్ హామీ ఇచ్చారు.

దీంతో సీపీఎస్ ఉద్యోగుల కుటుంబాలు.. పూర్తిగా వైసీపీకి అనుకూలంగా మారాయి. ఫ‌లితంగా 30 ల‌క్ష‌ల ఓట్లుగా ఉన్న సీపీఎస్ కుటుంబాల ఓటు బ్యాంకు పూర్తిగా వైసీపీ ఖాతాలోకి చేరింది. సీపీఎస్‌ను వారంలోనే ర‌ద్దు చేస్తామ‌ని చెప్పిన సీఎం జ‌గ‌న్‌ను వారు విశ్వ‌సించారు. కానీ, నాలుగున్న‌రేళ్లు అయినా.. సీపీఎస్‌ను ర‌ద్దు చేయ‌క‌పోగా.. అప్ప‌ట్లో దీని గురించి తెలియ‌ద‌ని అందుకే జ‌గ‌న్ హామీ ఇచ్చార‌ని.. స‌ల‌హాదారు స‌జ్జ‌ల రామ‌కృష్ణారెడ్డి మంగ‌ళం పాడేశారు.

క‌ట్ చేస్తే.. ఇప్పుడు ఇదేసీపీఎస్ ఉద్యోగుల కుటుంబాలు.. ఈ నెల 25న విజ‌య‌వాడ‌లో మ‌హాధ‌ర్నాకు పిలుపునిచ్చాయి. ఉద్యోగుల‌కు జ‌గ‌న్ ఇచ్చిన హామీల‌ను అమ‌లు చేయ‌క‌పోగా..సీపీఎస్ విష‌యంలో మ‌డ‌మ తిప్పార‌ని.. ఉద్యోగ కుటుంబాల‌కు చెందిన మ‌హిళా జేఏసీ(ఉద్యోగుల స‌తీమ‌ణులు) వ్యాఖ్యానించింది. అంతేకాదు.. ఈ నెల 25లోగా జ‌రిగే అసెంబ్లీలో సీపీఎస్‌ను ర‌ద్దు చేస్తూ.. తీర్మానం చేయాల‌ని డిమాండ్ చేసింది. లేనిప‌క్షంలో 25న మ‌హాధ‌ర్నా ఉంటుంద‌ని హెచ్చ‌రించింది.

అంతేకాదు.. త‌మ కుటుంబాల‌కు మొత్తం 30 ల‌క్ష‌ల ఓటు బ్యాంకు ఉంద‌ని, గ‌త ఎన్నిక‌ల్లో జ‌గ‌న్ ఇచ్చిన హామీని న‌మ్మి ఆయ‌న‌కు అనుకూలంగా ఓటు వేశామ‌ని.. ఇప్పుడు ఆయ‌న మాట నిల‌బెట్టుకోక‌పోతే.. వ‌చ్చే ఎన్నిక‌ల్లో వైసీపీని దూరం పెడ‌తామ‌ని.. ఒక్క ఓటు కూడా ప‌డ‌బోద‌ని మ‌హిళా జేఏసీ హెచ్చ‌రించ‌డం ఇప్పుడు ప్రాధాన్యం సంత‌రించుకుంది. ఈ ప‌రిణామం.. వైసీపీని ఇబ్బందుల్లోకి నెట్ట‌డం ఖాయ‌మ‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. నిజంగానే 30 ల‌క్ష‌ల ఓటు బ్యాంకులో సగంపోయినా.. వైసీపీ అధికారంలోకి రావ‌డం క‌ష్ట‌మ‌నే లెక్క‌లు అప్పుడే తెర‌మీదికి వ‌స్తున్నాయి. మ‌రి వైసీపీ ఏం చేస్తుందో చూడాలి.