మేము మాత్రం జనసేన తో పొత్తులోనే వున్నాం

టీడీపీ అధినేత చంద్ర‌బాబును స్కిల్ డెవ‌ల‌ప్‌మెంట్ కేసులో అవినీతి జ‌రిగిందంటూ అరెస్టు చేయ‌డం వెనుక బీజేపీ ఉంద‌ని, కేంద్ర పెద్దల సూచ‌న‌ల‌తోనే ఇది జ‌రిగింద‌ని కొంద‌రు చేస్తున్న ఆరోప‌ణ‌ల్లో నిజం లేద‌ని బీజేపీ ఏపీ అధ్య‌క్షురాలు ద‌గ్గుబాటి పురందేశ్వ‌రి అన్నారు. ఆదివారం ఆమె విజ‌య‌వాడ‌లో మీడియాతో మాట్లాడారు. చంద్రబాబును అరెస్టు చేసిన విధానాన్ని బీజేపీనే తొలుత తప్పు పట్టిందని తెలిపారు.

మాజీ సీఎం, 70 ఏళ్ల నాయ‌కుడిని అరెస్టు చేసిన తీరును ఖండిస్తున్నామని తామే ముందుగా ప్రకటన చేశామని పురందేశ్వ‌రి అన్నారు. సిఐడీ జగన్ ప్రభుత్వం ఆధ్వర్యంలో పని చేస్తోందని ఆరోపించారు. చంద్రబాబు అరెస్టు వెనుక బీజేపీ ఉందనేది అసత్య ప్రచారమని అన్నారు. ఏపీ, తెలంగాణ బీజేపీ నేతలు సైతం చంద్రబాబు అరెస్టును ఖండించారని ఆమె చెప్పారు.

పొత్తుల‌పై మాట్లాడుతూ.. రాజ‌కీయాల్లో పొత్తులు అనేవి స‌ర్వ‌సాధార‌ణ‌మ‌ని పేర్కొన్నారు పురందేశ్వ‌రి. జ‌న‌సేన అధినేత పవన్ పొత్తుల‌పై చేసిన‌ వ్యాఖ్యలను తాము తప్పుగా చూడటం లేదన్నారు. బీజేపీ అధిష్టానానికి అన్నీ వివరిస్తామని పవన్ చెప్పారని, అప్పుడు బీజేపీ అధిష్టానం రాష్ట్ర నేత‌ల అభిప్రాయాల‌ను కూడా కోరుతుంద‌ని.. ఆ స‌మ‌యంలో త‌మ అభిప్రాయం వెల్ల‌డిస్తామ‌న్నారు.

ప్ర‌స్తుతం జ‌నసేన పార్టీ బీజేపీతో పొత్తులోనే ఉందని పురందేశ్వ‌రి స్పష్టం చేశారు. తమ పార్టీ పెద్దల దృష్టికి రాష్ట్ర పరిస్థితులు.. పవన్ తీసుకువెళతామన్నారని, దీనిపై కేంద్రం పెద్దలు త‌మ‌తో చర్చలు చేసిన సమయంలో తమ అభిప్రాయాలు చెబుతామని స్పష్టం చేశారు. కాగా, రాష్ట్రంలో అరాచ‌క పాల‌న సాగుతోంద‌న్న ప‌వ‌న్ వ్యాఖ్య‌ల‌తో తాము కూడా ఏకీభ‌విస్తున్నామ‌న్నారు. ఈ విష‌యాన్ని రెండేళ్లుగా తాము చెబుతున్నామ‌ని పురందేశ్వ‌రి అన్నారు.