వైసీపీకి 100 నియోజ‌క‌వ‌ర్గాల్లో డిపాజిట్లు కూడా క‌ష్ట‌మే: డీఎల్‌

టీడీపీ అధినేత చంద్ర‌బాబు అరెస్టు, జైలుపై మాజీ మంత్రి డీఎల్ ర‌వీంద్రారెడ్డి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. అదేస‌మ‌యంలో చంద్ర‌బాబుకు రిమాండ్ విధించిన ఏసీబీ కోర్టు న్యాయ‌మూర్తి వైఖ‌రిని కూడా ఆయ‌న ప్ర‌శ్నించారు. చంద్రబాబుకు సంబంధించిన‌ 28 పేజీల రిమాండ్ రిపోర్ట్ లో త‌న‌కు ఎక్కడా తప్పు చేసినట్లు క‌నిపించ‌లేద‌న్నారు. న్యాయ చరిత్రలోనే ఇటువంటి ఆర్డర్ ఇచ్చిన జడ్జి ఎక్కడా లేర‌ని ఆయ‌న వ్యాఖ్యానించారు. ఎటువంటి ఆధారాలు లేకుండా రిమాండ్ విధించారని చెప్పారు.

జడ్జిమెంట్ రిపోర్ట్ ను క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని డీఎల్ అభిప్రాయ‌ప‌డ్డారు. సీఎం జ‌గన్మోహన్ రెడ్డి లాగా చంద్ర‌బాబు దేశం విడిచి వెళ్లే వ్యక్తి కాద‌ని, ఎప్పుడు విచారణకు పిలిచినా ఆయ‌న హాజ‌ర‌వుతార‌ని, అలాంటి వ్య‌క్తిని జైల్లో పెట్టార‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. 74 సంవత్సరాల వయసున్న చంద్ర‌బాబును ఆరోగ్య సమస్యలు ఉన్న నాయ‌కుడిని జైలుకు పంపించ‌డం దారుణ‌మ‌ని వ్యాఖ్యానించారు.

జగన్మోహన్ రెడ్డి రాజ‌కీయ కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే చంద్రబాబును జైలుకు పంపారని డీఎల్ వ్యాఖ్యానించారు. నంద్యాలలో అరెస్టు చేస్తే అక్కడే ఉన్న కోర్టులో హాజరు పరచాలని, కానీ, సుదూరంలో ఉన్న విజ‌య‌వాడ‌కు తీసుకువెళ్లార‌ని అన్నారు. జగన్మోహన్ రెడ్డి తండ్రి స్నేహితుడిగా సీఎం జ‌గ‌న్‌కు సలహా ఇస్తున్నాన‌ని, కక్ష సాధింపులు మానుకోవాలని డీఎల్ సూచించారు.

గ‌త ఎన్నిక‌ల్లో వైసీపీకి ఓటు వేసి తాను పెద్ద త‌ప్పు చేశాన‌ని చెప్పారు. అందుకు ప్రాయ‌శ్చిత్తంగా త‌న చెప్పుతో తానే కొట్టుకుంటున్న ట్టు తెలిపారు. రాష్ట్రంలో పొత్తు రాజ‌కీయాలు కొత్త‌కాద‌ని, అయితే, ఇప్పుడు టీడీపీ-జ‌న‌సేన పొత్తు వ‌చ్చే ఎన్నిక‌ల‌పై తీవ్ర ప్ర‌భావం చూపిస్తుంద‌ని వ్యాఖ్యానించారు. వైసీపీకి 100 నియోజ‌క‌వ‌ర్గాల్లో డిపాజిట్లు ద‌క్క‌క పోయినా ఆశ్చ‌ర్యం లేద‌ని అన్నారు. ప‌వ‌న్‌ను త‌క్కువగా అంచ‌నా వేయ‌డం స‌రికాద‌ని ఆయ‌న సీఎం జ‌గ‌న్‌కు సూచించారు.