నీటి వాటా తేల్చ‌లేని వ్య‌క్తి విశ్వ‌గురువా?: కేసీఆర్

చాన్నాళ్ల త‌ర్వాత ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోడీపై తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ సంచ‌ల‌న విమ‌ర్శ‌లు చేశారు. రెండు తెలుగు రాష్ట్రాల మ‌ధ్య కొన్ని ద‌శాబ్దాలుగా ఉన్న నీటి వివాదాన్ని ప‌రిష్క‌రించ‌లేని వ్య‌క్తి… త‌న‌ను తాను విశ్వ గురువుగా ప‌రిగ‌ణించుకుం టూ ప్ర‌చారం చేసుకుంటున్నార‌ని తీవ్ర‌స్థాయిలో వ్యాఖ్య‌లు గుప్పించారు. కృష్ణా జలాల్లో వాటా తేల్చ‌మ‌ని అనేక సంద‌ర్భాల్లో తాను స్వ‌యంగా కేంద్రానికి లేఖ‌లు రాశాన‌ని.. అయితే, ఇప్ప‌టికీ చేత‌కాని ద‌ద్ద‌మ్మ మాదిరిగా కేంద్రం వ్య‌వ‌హ‌రిస్తోంద‌ని విరుచుకుప‌డ్డారు.

శనివారం పాలమూరు ఎత్తిపోతల పథకం మొదటి పంప్‌ను సీఎం కేసీఆర్‌ ప్రారంభించారు. స్థానిక సాగునీటికి నీటిని విడుదల చేశారు. అనంత‌రం కొల్లాపూర్ లో నిర్వ‌హించిన బహిరంగ సభలో కేసీఆర్ మాట్లాడారు. “దక్షిణ తెలంగాణ చరిత్రలో సువర్ణ అధ్యాయం ప్రారంభ‌మైంది. పాలమూరు ప్రజలంటే ఒకప్పడు అడ్డా కూలీలు. అయితే, వారి త‌ల‌రాత‌లు మారాయి. ఈ రోజు తెలంగాణ ప్రజలే.. ఇతర రాష్ట్రాల వారిని పనిలో పెట్టుకుంటున్నారు” అని కేసీఆర్ వ్యాఖ్యానించారు.

పాలమూరు ఎంపీగా ఉన్నప్పుడే తాను తెలంగాణ సాధించాన‌ని కేసీఆర్ చెప్పారు. అయితే, కొందరు నేతల కార‌ణంగానే.. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్ట్‌ నిర్మాణం ఆలస్యమైందని చెప్పారు. గత పాలకులు ప‌ద‌వుల కోసం ఆశ‌లు ప‌డి పాలమూరు జిల్లా నీటివాటా గురించి అడగలేదని విమ‌ర్శ‌లు గుప్పించారు. ఇంటి దొంగలే మనకు ప్రాణగండం తెచ్చారని వ్యాఖ్యానించారు.

“మన నీళ్లు ఏపీకి తరలిస్తుంటే.. ఈ జిల్లా నేతలు జెండాలు ఊపారు. కృష్ణా జలాల్లో తెలంగాణ వాటా తేల్చమంటే మోడీకి చేతకావటం లేదు. విశ్వగురువుగా మాత్రం త‌న‌ను తాను ప్ర‌చారం చేసుకుంటున్నాడు. అలా చెప్పుకునే మోడీ.. 9ఏళ్లుగా మన నీళ్ల వాటా తేల్చలేదు. బీజేపీ నేతలను పాలమూరు జిల్లా ప్రజలు నిలదీయాలి. పదేళ్లుగా కృష్ణా ట్రైబ్యునల్‌కు ఎందుకు ప్రతిపాదనలు పంపటం లేదో ప్ర‌శ్నించాలి” అని కేసీఆర్ వ్యాఖ్యానించారు.