దారి లేని బీజేపీ.. ట్రయాంగిల్ లవ్ స్టోరీ?

ఆంధ్రప్రదేశ్లో బీజేపీ మరోసారి ట్రయాంగిల్ లవ్ స్టోరీ నడపక తప్పదా? టీడీపీతో కలిసి వెళ్లడం తప్ప ఆ పార్టీకి మరో మార్గం లేదా? అంటే రాజకీయ వర్గాల నుంచి అవుననే సమాధానాలే వినిపిస్తున్నాయి. ఏపీలో రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీ కలిసి పని చేయడం ఖాయమనే సూచనలు కనిపిస్తున్నాయి. తాజాగా టీడీపీతోనే కలిసి సాగుతామని, కలిసే ఎన్నికల్లో పోటీ చేస్తామని జనసేన అధినేత పవన్ కల్యాణ్ ప్రకటించడమే అందుకు కారణమని చెప్పాలి.

ప్రత్యేక హోదా విషయంలో టీడీపీతో తెగదెంపులు చేసుకున్న జనసేన.. 2019 ఎన్నికల్లో ఒంటరిగానే పోటీ చేసింది. కానీ ఆ తర్వాత మూడు రాజధానులకు వ్యతిరేకమంటూ, రాష్ట్ర ప్రయోజనాల కోసమని బీజేపీతో ఆ పార్టీ కలిసింది. అప్పటి నుంచి జనసేన, బీజేపీ పొత్తులోనే ఉన్నాయి. కానీ టీడీపీని మాత్రం దూరం పెడుతూ వచ్చాయి. ఈ రెండు పార్టీలతో కలిసేందుకు టీడీపీ ప్రయత్నిస్తోందనే అభిప్రాయాలు వినిపించాయి. కానీ ముఖ్యమంత్రి కావాలనే లక్ష్యంతో ఉన్న పవన్.. టీడీపీతో పొత్తు విషయంలో దీర్ఘంగా ఆలోచించారనే చెప్పాలి. ఇప్పుడు చంద్రబాబు అరెస్టు నేపథ్యంలో జగన్పై పోరాటానికి టీడీపీతో కలిసి పని చేస్తామని పవన్ అన్నారు. ఇది తమ కోసం కాదని రాష్ట్రం కోసమని మరోసారి నొక్కి చెప్పారు.

మరి టీడీపీ, జనసేన పొత్తుపై బీజేపీ ఎలా స్పందిస్తుందన్నది ఆసక్తి రేపుతోంది. టీడీపీతో కలిసి సాగుతామని ప్రకటించిన పవన్.. బీజేపీ కూడా కలిసి వస్తుందనే ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. కానీ బీజేపీ మాత్రం వేచి చూసే ధోరణి అవలంబిస్తోందని తెలిసింది. పొత్తు విషయం జాతీయ నేతలు చూసుకుంటారని రాష్ట్ర బీజేపీ నేతలు చేతులు దులుపేసుకున్నారు. కానీ పొత్తు తప్ప బీజేపీకి మరో మార్గం కనిపించడం లేదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. పైగా ఇప్పుడు బీజేపీ ఏపీ అధ్యక్షురాలిగా చంద్రబాబు వదిన పురందేశ్వరి ఉన్నారు. దీంతో టీడీపీ, జనసే, బీజేపీ కలిసి ముందుకు సాగడం ఖాయమేనన్న అంచనాలు కలుగుతున్నాయి.