కేసీఆర్‌కు రాజ‌కీయం రుచి చూపిస్తున్న మైనంప‌ల్లి

తెలంగాణ ముఖ్య‌మంత్రి, బీఆర్ఎస్ పార్టీ ర‌థ‌సార‌థి కేసీఆర్ ఇటీవ‌లి కాలంలో అత్యంత‌ ఇరుకున ప‌డ్డ విష‌యం ఏదైనా ఉందంటే అది మ‌ల్కాజ్‌గిరి ఎమ్మెల్యే మైనంప‌ల్లి హ‌న్మంత‌రావు ఎపిసోడ్‌లోనే. త‌నతో పాటు కుమారుడికి ఎమ్మెల్యే టికెట్ కోరిన మైన‌ప‌ల్లికి బీఆర్ఎస్ అధినేత నో చెప్పిన సంగ‌తి తెలిసిందే. అయితే, ఒకే కుటుంబంలో కేసీఆర్‌, కేటీఆర్‌, హ‌రీశ్‌రావు, క‌విత‌, సంతోష్‌రావుల‌కు ప‌దవులు ద‌క్కిన‌పుడు త‌న కుటుంబంలో కుమారుడికి మాత్రం ఎందుకు టికెట్ ఇవ్వ‌రంటూ మైనంప‌ల్లి చేసిన వ్యాఖ్య‌లు టీఆర్ఎస్‌లో కేసీఆర్ నాయ‌క‌త్వం ప‌ట్ల నేత‌ల‌కు ఉన్న భ‌యంతో కూడిన గౌర‌వంపై సందేహాలు వ్య‌క్తం చేశాయి. అయిన‌ప్ప‌టికీ మైనంప‌ల్లిపై కేసీఆర్ ఎలాంటి చ‌ర్య‌లు తీసుకోకుండా వేచిచూసే దోర‌ణి అవ‌లంభిస్తున్నారు. అయితే, కేసీఆర్ సంయ‌మ‌నం నేప‌థ్యంలో గులాబీ ద‌ళ‌ప‌తికి తన మార్కు రాజ‌కీయాన్ని మైనంప‌ల్లి రుచిచూపిస్తున్నార‌ని అంటున్నారు.

పార్టీ ర‌థ‌సార‌థి కేసీఆర్ నిర్ణ‌యాల‌ను మైనంప‌ల్లి ప్ర‌శ్నించినా ఆయ‌న‌పై చ‌ర్య‌లు లేక‌పోవ‌డంపై ఓ వైపు బీఆర్ఎస్ శ్రేణుల‌ను విస్మ‌యంలోకి నెట్టుతుండ‌గా తాజాగా మైనంప‌ల్లి త‌న రూట్ తాను చూసుకునే ప‌నిలో కొత్త గేమ్ మొద‌లుపెట్టారు. త‌న‌కు అత్యంత సన్నిహితుడు అయిన మాజీ జెడ్పీటీసీ, బీఆర్ఎస్ రాష్ట్ర నేత‌ నక్కా ప్రభాకర్‌గౌడ్ ను మీడియాతో మాట్లాడించి టీఆర్ఎస్ పార్టీపై దుమ్మెత్తిపోయించారు. మంత్రి మ‌ల్లారెడ్డికి మ‌రోమారు చాన్స్‌ ఇవ్వ‌కూడ‌ద‌ని పేర్కొంటూ త‌న‌కే ఆ టికెట్ కేటాయించాల‌ని ప్రభాకర్ గౌడ్ కోరారు. త‌న‌కు టికెట్ ద‌క్క‌క‌పోతే కాంగ్రెస్ పార్టీలో చేరాల‌ని అనుచ‌రులు చెప్తున్నార‌ని ప్ర‌భాక‌ర్ గౌడ్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు.

అయితే, ప్ర‌భాక‌ర్ గౌడ్ మీడియాతో ఈ కామెంట్లు చేయ‌డానికంటే ముందే మైనంప‌ల్లి త‌న మార్కు చాణ‌క్యం ప్ర‌ద‌ర్శించార‌ని స‌మాచారం. ఇటివలే టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌ రెడ్డితో మైనంప‌ల్లి సూచ‌న‌ల మేర‌కు రహస్యంగా ప్రభాకర్‌గౌడ్‌ భేటీ అయ్యార‌ని స‌మాచారం. మేడ్చ‌ల్ టికెట్ విష‌యంలో ప్రభాకర్‌గౌడ్‌కి రేవంత్ హామీ ఇచ్చారని స‌మాచారం. మొత్తంగా తన అనుచరుల్ని కాంగ్రెస్‌లోకి పంపడం ద్వారా బీఆర్‌ఎస్‌ ఓట్లకు త‌న‌కు ప‌ట్టున్న నియోజకవర్గాల్లో గండికొట్టే ప్రయత్నం మైనంప‌ల్లి చేస్తున్నారని స‌మాచారం.

మ‌రోవైపు, మైనంప‌ల్లి తాను కాంగ్రెస్ గూటికి చేరే క్ర‌మంలో వేగంగా అడుగులు వేస్తున్నార‌ని సెప్టెంబర్ 17న సోనియా, రాహుల్, ప్రియాంక గాంధీ సమక్షంలో అధికారికంగా పార్టీలో చేరవచ్చని అంటున్నారు. ఇప్పటికే కాంగ్రెస్ నేతలతో చర్చలు జ‌ర‌గ‌గా, త‌న‌తో పాటే తన కుమారుడిని కాంగ్రెస్‌ టికెట్‌పై పోటీకి దించేందుకు మైనంపల్లి హామీ పొందిన‌ట్లు సమాచారం. మైనంప‌ల్లి క‌ద‌లిక‌ల‌ను బీఆర్ఎస్ గ‌మ‌నిస్తూ చ‌ర్య‌ల విష‌యంలో జాప్యం చేస్తోందా లేదంటే అధిష్టానం దృష్టికి అస‌లు విష‌యాలు తెలియ‌ట్లేదా అనేది చ‌ర్చ‌నీయాంశంగా మారింది.