ఈ అరెస్టుతో బాబుకు జగన్ మేలు: గోనె

టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్టు వ్యవహారాన్ని ఏపీ, తెలంగాణతో పాటు దేశ వ్యాప్తంగా పలువురు రాజకీయ నేతలు ఖండించిన సంగతి తెలిసిందే. చంద్రబాబును అరెస్టు చేసిన విధానాన్ని పలువురు నేతలు తప్పుబట్టారు. ఈ క్రమంలోనే ఈ వ్యవహారంపై తెలంగాణ పొలిటిషియన్, మాజీ ఎమ్మెల్యే గోనె ప్రకాష్ రావు స్పందించారు. ప్రాథమిక ఆధారాలు ఉండటంతోనే చంద్రబాబును అరెస్ట్ చేశామని సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పడం సిగ్గుచేటని దుయ్యబట్టారు.

అయితే, టీడీపీకి చంద్రబాబు అరెస్ట్ తప్పకుండా మేలు చేస్తుందని, రాబోయే ఎన్నికల్లో వైసీపీ ఓటమి ఖాయమని జోస్యం చెప్పారు. ఇక, ఏపీలో గత ఎన్నికలలో వైసీపీ రికార్డు విజయం సాధించిందని, ఆ రికార్డును టీడీపీ బద్దలు కొట్టడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. చంద్రబాబు రాబోయే ఎన్నికల్లో టీడీపీకి 151 సీట్లు మెజార్టీ తెప్పించి మరోసారి ముఖ్యమంత్రి అవుతారని జోస్యం చెప్పారు. వాస్తవానికి ఈ అరెస్టుతో చంద్రబాబు నెత్తిన జగన్ పాలు పోశాడని అన్నారు.

ఇక, తెలంగాణ రాజకీయాల్లో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిపై కూడా గోనె ప్రకాష్ షాకింగ్ కామెంట్స్ చేశారు. కాంగ్రెస్ పార్టీని రేవంత్ రెడ్డి నాశనం చేస్తున్నాడని మండిపడ్డారు. ఇక, తెలంగాణ కాంగ్రెస్ తరఫున పోటీ చేయాలని భావిస్తున్న వైఎస్ షర్మిలను కూడా రాకుండా రేవంత్ అడ్డుకుంటున్నారని ఆరోపించారు. 2014లో పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వైసీపీ నుంచి గెలిచారని, ఆయనను కాంగ్రెస్ పార్టీలోకి ఎందుకు తీసుకున్నారని ప్రశ్నించారు. డబ్బులు ఇచ్చాడు కాబట్టే పొంగులేటిని కాంగ్రెస్ లోకి తీసుకున్నాడని సంచలన ఆరోపణలు చేశారు.