చంద్రబాబు లాయర్లపై జడ్జి అసహనం.. విచారణ వాయిదా

ఏపీ స్కిల్ డెవలప్ మెంట్ స్కామ్ కేసులో టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడును 14 రోజుల రిమాండ్ విధిస్తూ రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే చంద్రబాబును హౌస్ రిమాండ్ కు తరలించాలని ఆయన తరపు న్యాయవాది సిద్ధార్థ లూథ్రా విజయవాడలో ఏసీబీ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ క్రమంలోనే ఈ పిటిషన్ పై ప్రభుత్వ తరపు న్యాయవాదులు శ్రీరామ్, పొన్నవోలు సుధాకర్ లు వాదనలు వినిపించారు. ఈ క్రమంలోనే తాజాగా ఆ పిటిషన్ పై విచారణను ఏసీబీ కోర్టు జడ్జి హిమబిందు రేపటికి వాయిదా వేశారు.

అంతకుముందు, చంద్రబాబు తరఫు లాయర్లపై న్యాయమూర్తి అసహనం వ్యక్తం చేశారు. ఈ కేసుకు సంబంధించిన అన్ని డాక్యమెంట్లు సీఐడీ కార్యాలయంలో ఉన్నాయని, వాటి పరిశీలన కోసం అనుమతించాలని సెక్షన్ 207 CRPC కింద చంద్రబాబు తరఫు లాయర్లు పిటిషన్ దాఖలు చేశారు. పిటిషన్ దాఖలు చేసిన వెంటనే వాదనలు వినిపించేందుకు లూథ్రా ప్రయత్నించారు. ఈ క్రమంలో లూథ్రాపై జడ్జి హిమబిందు అసహనం వ్యక్తం చేశారు. వరుసగా పిటిషన్లు దాఖలు చేయడం, ఆ వెంటనే వాదనలు వినిపించడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వరుస పిటిషన్లు వేయడం వల్ల కోర్టు సమయం వృథా అవుతోందని అన్నారు. ఆర్డర్ ఇచ్చే సమయానికి మరో పిటిషన్ వేయడంపై అసహనం వ్యక్తం చేశారు.