ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో హైకోర్టు సంచలన ఆదేశాలు

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఫోన్ ట్యాపింగ్ కు పాల్పడుతోందని వస్తోన్న ఆరోపణలు దేశవ్యాప్తంగా పెనుదుమారం రేపుతోన్న సంగతి తెలిసిందే. ఏపీలోని ప్రతిపక్ష నేతలు, న్యాయవాదులు, న్యాయమూర్తులు, జర్నలిస్టులు, కార్యకర్తల ఫోన్లు ట్యాపింగ్ కు గురవుతున్నాయని విపక్ష నేత చంద్రబాబు ఏకంగా ప్రధాని మోడీకి లేఖ రాశారు.

ఏపీలో ఆర్టికల్స్ 19 మరియు 21 ఉల్లంఘనకు పాల్పడుతున్నారని, ఈ వ్యవహారంపై కేంద్ర సంస్థలతో విచారణ జరిపించాలని ఆయన కోరారు. అయితే, ఫోన్ ట్యాపింగ్‌పై ఏమైనా ఆధారాలు ఉంటే తమకు ఇవ్వాలని..తాము విచారణ చేపడతామని చంద్రబాబుకు ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్ లేఖ రాశారు.

మరోవైపు, ఈ అంశంపై ఏపీ హైకోర్టులో పలు పిటిషన్లు దాఖలయ్యాయి. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై ఆధారాలుంటే సమర్పించాలని పిటిషనర్ ను ఆదేశించిన హైకోర్టు.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతో పాటు.. టెలికాం సర్వీస్ ప్రొవైడర్లకు గతంలోనే నోటీసులు జారీ చేసింది.

ఈ వ్యవహారంపై ఏపీ ప్రభుత్వం తరపున అఫిడవిట్ దాఖలు చేయాలని ఆదేశించింది. ఈ నేపథ్యంలో తాజాగా ఆ పిటిషన్లపై మరోసారి విచారణ జరిపిన హైకోర్టు సంచలన ఆదేశాలు జారీ చేసింది. ఫోన్ ట్యాపింగ్ ఆరోపణల వ్యవహారంలో 16 మందికి ఏపీ హైకోర్టు నోటీసులు జారీ చేసింది.

సీబీఐ, రిలయన్స్ జియో, వోడాఫోన్, ఎయిర్‌టెల్, బీఎస్‌ఎన్‌ఎల్, ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్ అసోషియేషన్ అధ్యక్షుడులు నోటీసులు అందుకున్న వారిలో ఉన్నారు. వీరంతా వ్యక్తిగతంగా లేదా న్యాయవాది ద్వారా కోర్టుకు హాజరుకావాలని నోటీసులు జారీ అయ్యాయి. ఈ నోటీసులపై 4 వారాల్లో సమాధానాలు పంపాలని హైకోర్టు ఆదేశించింది.

కాగా, న్యాయమూర్తులు, న్యాయవాదులు, విపక్ష నేతలు, జర్నలిస్టుల ఫోన్లు, వారి క‌ద‌లిక‌ల‌పై నిఘా పెట్టారంటూ పలు కొన్ని పత్రికలు, టీవీ ఛానళ్లలో వ‌చ్చిన వార్త‌ల‌పై హైకోర్టులో ప్రజా ప్ర‌యోజ‌న వాజ్యం దాఖ‌ల‌య్యింది. ప్రభుత్వంలోని పెద్దల అండ‌తో న్యాయ వ్యవస్థ ప్రతిష్టకు కళంకం తెచ్చేలా వ్యవహరించారని విశాఖ‌పట్నంలోని గోపాలపట్నానికి చెందిన న‌క్కా నిమ్మీగ్రేస్ ఈ పిటిష‌న్ దాఖ‌లు చేశారు.

హైకోర్టు న్యాయమూర్తుల ఫోన్ల ట్యాపింగ్‌, ట్రాకింగ్‌, నిఘా తదితరాలకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, హోంశాఖ ముఖ్యకార్యదర్శి, డీజీపీల వ్యవహారంపై సీబీఐ ప్రత్యేక దర్యాప్తు బృందం ద్వారా లోతుగా విచారణ జరపాలని.. నిబంధనల ఉల్లంఘనలకు పాల్పడిన అధికారులను బాధ్యులను చేసేలా ఆదేశాలు జారీ చేయాలని కోర్టును పిటిష‌న‌ర్ కోరారు. దీనిపై విచారణ జరిపిన హైకోర్టు తాజాగా 16మందికి నోటీసులు జారీ చేసింది.