ఎన్టీవీ, టీవీ5ల మధ్య రచ్చపై నెటిజన్ల చర్చ…వైరల్

దేశంలోని పలు మీడియా సంస్థలు, పత్రికలు ఏదో ఒక రాజకీయ పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తుంటాయన్న విమర్శలు సోషల్ మీడియాలో వస్తుంటాయి. ఇరు తెలుగు రాష్ట్రాల్లోని పలు మీడియా చానెళ్లు కూడా అందుకు మినహాయింపు కాదని నెటిజన్లు విమర్శలు గుప్పిస్తున్నారు తమకు దన్నుగా ఉన్న రాజకీయ పార్టీలకు అనుకూలంగా…వైరి వర్గాలకు ప్రతికూలంగా కథనాలు ప్రసారం చేస్తుంటాయని కొన్ని మీడియా సంస్థలపై సోషల్ మీడియాలో ఆరోపణలు వస్తున్నాయి.

కొన్ని పత్రికలు ప్రభుత్వానికి అనుకూలంగా వ్యవహరించడం, వైరి రాజకీయ పార్టీలపై మీడియా సంస్థలు విమర్శలు చేయడం..కథనాలు ప్రసారం చేయడం….ప్రోమోలు వేయడం మామూలేనని, అయితే, తాజాగా ఏపీలో ఓ కొత్త సంస్కృతికి రెండు ప్రముఖ చానెళ్లు తెరలేపాయని నెటిజన్లు చర్చించుకుంటున్నారు.

ఓ మీడియా సంస్థ అధినేతపై మరో మీడియా సంస్థ తీవ్ర ఆరోపణలు చేయడం సంచలనం రేపిందని నెటిజన్లు చర్చించుకుంటున్నారు. టీవీ5,ఎన్టీవీ చానెళ్ల మధ్య మొదలైన వివాదం చినికిచినికి గాలివానగా మారిందని, టీవీ5 అధినేత నాయుడు అవినీతిపై వరుస కథనాలు అంటూ ఎన్టీవీ విడుదల చేసిన ప్రోమోలు సోషల్ మీడియాలో తీవ్ర చర్చనీయాంశమయ్యాయి.

టీవీ 5 యాజమాన్యం రియల్ ఎస్టేట్ వ్యాపారం, మోకాలినొప్పుల బామ్ ల తయారీలో అవినీతి, బోగస్ అంటూ ఎన్టీవీ ప్రోమోలు విడుదల చేయడం సోషల్ మీడియాలో చర్చనీయాంశమైంది. ఒక నాయుడు వంద లీలల పేరుతో వరస కథనాలు అంటూ ఎన్టీవీ విడుదల చేసిన ప్రోమోతో ఇరు చానెళ్ల మధ్య వివాదం తారస్థాయికి చేరిందని నెటిజన్లు చర్చించుకుంటున్నారు.

ఒక మీడియా సంస్థ మీద మరో మీడియా సంస్థ ఇంటరాగేషన్ చేయడం…కథనాలు ప్రసారం చేయడం వంటి కొత్త సంస్కృతికి రెండు తెలుగు మీడియా చానెళ్లు తెరలేపడం చర్చనీయాంశమైంది. ఓ చానెల్ పై, దాని అధినేతపై నిఘా పెట్టడం…వ్యక్తిగతంగా టార్గెట్ చేయడం వంటి కొత్త వ్యవహారాలు తెరపైకి రావడంపై నెటిజన్లు విమర్శలు గుప్పిస్తున్నారు.

కొత్త సంస్కృతికి తెరలేపిన ఆ మీడియా చానెళ్ల వ్యవహారశైలిపై చర్చించుకుంటున్నారు. ఈ రెండు చానెళ్ల మధ్య వివాదం సోషల్ మీడియాలో.వైరల్ అయింది. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ రెండు చానెళ్ల మధ్య చెలరేగిన వివాదానికి పుల్ స్టాప్ ఎపుడు పడుతుందోనని అనుకుంటున్నారు.