బీఆర్ఎస్ టెంపుల్ రాజకీయాలు మొదలుపెట్టిందా ?

ఎన్నికల్లో గెలుపుకోసం బీఆర్ఎస్ అభ్యర్ధులు అందుబాటులో ఉన్న అన్నీ మార్గాలను అన్వేషిస్తున్నారు. ఇప్పటికే ప్రభుత్వం అభివృద్ధి, సంక్షేమపథకాలు బ్రహ్మాండంగా జరుగుతున్నాయని ఒకటే ఊదరగొడుతోంది. దీనికి అదనంగా సెంటిమెంటు రాజకీయాలు కూడా మొదలయ్యాయి. నియోజకవర్గాల వారీగా జనాలను దేవాలయాలకు తీసుకెళుతున్నారు బీఆర్ఎస్ ఎంఎల్ఏల అభ్యర్ధులు. ఆర్మూరు ఎంఎల్ఏ జీవన్ రెడ్డి తన నియోజకవర్గంలోని ఓటర్లలో ఆసక్తి ఉన్నవారిని సొంత ఖర్చులతో యాదాద్రి దేవాలయానికి తీసుకెళ్ళారు. ఇదే విధమైన ప్లాన్ సిరిసిల్లలో కూడా జరుగుతోంది. సిరిసిల్లంటే అందరికీ తిలిసిందే మంత్రి కేటీయార్ నియోజకవర్గమని.

వీళ్ళిద్దరిని చూసి ఇతర నియోజకవర్గాల్లోని అభ్యర్ధులు కూడా టెంపుల్ టూర్లకు ప్లాన్ చేస్తున్నారు. సిరిసిల్ల నుండి ఏకంగా 14 బస్సుల్లో జనాలను యాదాద్రి ఆలయానికి తీసుకెళ్ళారు. 14 బస్సుల్లో తీసుకెళ్ళారంటే సుమారు 700 మందిని తీసుకెళ్ళినట్లు లెక్క. మొత్తంమీద యాదాద్రిలోని లోకల్ లీడర్లు సుమారుగా వెయ్యిమందికి దగ్గరుండి దర్శనాలు చేయించారు. మునుగోడు ఉపఎన్నిక సందర్భంగా కూడా ఇలాంటి టెంపుల్ రాజకీయాలే చేశారు. ఇంకా చాలామంది అభ్యర్ధులు టెంపుల్ రాజకీయాలు మొదలుపెట్టబోతున్నారని సమాచారం.

అప్పట్లో జీవన్ రెడ్డి చేయించిన టెంపుల్ రాజకీయంపై పెద్ద దుమారమే రేగింది అయినా ఎవరు పట్టించుకోలేదు. అలాంటిది ఇపుడు సాధారణ ఎన్నికలకు ముందు అలాంటి టెంపుల్ రాజకీయాలే బీఆర్ఎస్ మళ్ళీ మొదలుపెట్టింది. నిజానికి జనాలను దేవాలయాలకు తీసుకెళ్ళినంతమాత్రాన ఏమిటి ఉపయోగమో తీసుకెళ్ళేవాళ్ళకే తెలియాలి. జనాలకు కావాల్సిన అవసరాలు తీర్చకుండా, ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా మాయచేసి దేవాలయాలకు తీసుకెళితే సరిపోతుందా ?

రైతు రుణమాఫీ సంపూర్ణంగా చేయలేదు. రుణమాఫీ కాకుండా మిగిలిపోయిన రైతుల సంఖ్య సుమారు 20 లక్షలు. అలాగే దళితబంధు, బీసీ బంధును అమలు చేయలేదు. మైనారిటీలకు రుణాలను అందించలేదు. ఎస్సీలకు 3 ఎకరాలను ఇవ్వలేదు. ఇవన్నీ స్వయంగా కేసీయార్ ఇచ్చిన హామీలే అని అందరికీ తెలుసు. రాబోయే ఎన్నికల్లో ఓటమిభయంతోనే హడావుడిగా రైతురుణమాఫీ అని కేసీయార్ డ్రామాలు మొదలుపెట్టారు. పైకి మాత్రం అభివృద్ధి కార్యక్రమాలను, సంక్షేమపథకాలను అందిస్తున్న రాష్ట్రం దేశంమొత్తంమీద ఇలాంటిది లేనేలేదని ఊదరగొడతుంటారు. రేపటి ఎన్నికల్లో తేలిపోతుంది ఎవరి బండారమేంటో.