డిప్యూటీ సీఎం… ష‌ర్మిల అదే ప‌ట్టు!

వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్య‌క్షురాలు వైఎస్ ష‌ర్మిల‌.. తాజాగా ఢిల్లీలో ప‌ర్య‌టించారు. త‌న భ‌ర్త‌, సువార్తీకుడు అనిల్‌కుమార్‌తో క‌లిసి ఆమె కాంగ్రెస్ అధినేత్రి సోనియా నివాసంలో ఆమెతో సుమారు 45 నిమిషాల పాటు భేటీ అయ్యారు. ఈ సంద‌ర్భంగా కుటుంబ విష‌యాలు కూడా చ‌ర్చ‌కు వ‌చ్చిన‌ట్టు స‌మాచారం. ప్ర‌ధానంగా జ‌గ‌న్ గురించి సోనియా అడిగార‌ని, ఇప్పుడు ఎలాంటి రిలేష‌న్ లేద‌ని తెలియ‌డంతో ఆశ్చ‌ర్యం వ్య‌క్తం చేశార‌ని తెలిసింది.

ఇక‌, తెలంగాణ రాజ‌కీయాల గురించిన ప్ర‌స్తావ‌న‌లో వైఎస్సార్ టీపీని విలీనం చేయ‌డంపై ప్ర‌ధానంగా చ‌ర్చించారు. అయితే, ఈ సంద‌ర్భంగా గ‌తంలో తాను నిర్దేశించుకున్న డిమాండ్ల‌నే ష‌ర్మిల తాజాగా సోనియా ముందు కూడా ప్ర‌స్తావించిన‌ట్టు తెలిసింది. పాలేరు టికెట్‌తో పాటు.. త‌న వారికి 15 మందికి టికెట్లు ఇవ్వాల‌ని ష‌ర్మిల ప‌ట్టుబ‌ట్టారు. అంతేకాదు.. డిప్యూటీ సీఎం పోస్టు కోసం.. ష‌ర్మిల గ‌ట్టి ప‌ట్టే ప‌డుతున్న‌ట్టు ఢిల్లీ వ‌ర్గాలు కూడా చెబుతున్నాయి.

అయితే. ఈ విష‌యంలో సోనియా న‌ర్మ‌గ‌ర్భంగా వ్య‌వ‌హ‌రించిన‌ట్టు స‌మాచారం. ప‌ద‌వుల విష‌యాన్ని ఎన్నిక‌ల త‌ర్వాత చ‌ర్చించుకుని నిర్ణ‌యం తీసుకుంటామ‌ని.. చెప్పిన‌ట్టు ఢిల్లీ వ‌ర్గాలు అంటున్నాయి. ప్రధానంగా పార్టీ విలీనం, షర్మిల సేవలను ఏ రకంగా ఎక్కువగా వాడుకుంటారన్నదానిపైనే చర్చించిన‌ట్టు తెలిసింది. వైఎస్ చ‌రిష్మా.. గురించి సోనియా అడిగి తెలుసుకున్నార‌ని తెలిసింది. అయితే.. ఏదేమైనా.. ష‌ర్మిల ప‌ట్టుద‌ల ముందు.. సోనియా కొంత మేర‌కు అస‌హ‌నం వ్య‌క్తం చేసిన‌ట్టు స‌మాచారం.

కానీ, ష‌ర్మిల వైపు మాత్రం ఇప్పుడు ప‌ట్టుబ‌ట్ట‌క‌పోతే.. త‌ర్వాత ఏమీ ద‌క్క‌ద‌న్న ఉద్దేశం స్ప‌ష్టంగా క‌నిపిస్తోంద‌ని ప‌రిశీల‌కులు చెబుతున్నారు. చివ‌రకు ఏం జ‌రుగుతుందో చూడాలి.