రాజాసింగ్ కు మరోసారి టికెట్?

ప్రస్తుతం పార్టీ నుంచి సస్పెన్షన్ ఎదుర్కొంటున్న బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్ వచ్చే ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం ఉందా? పార్టీ ఆయన పట్ల సానుకూలంగా ఉందా? అంటే రాజకీయ వర్గాల నుంచి అవుననే సమాధానాలే వినిపిస్తున్నాయి. తాజాగా బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలే అందుకు నిదర్శనమని చెబుతున్నారు. గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ సస్పెన్షన్ విషయంలో అధిష్ఠానం సానుకూల నిర్ణయం తీసుకుంటుందని తాజాగా కిషన్ రెడ్డి చెప్పారు. రాజాసింగ్ విషయంలో కార్యకర్తలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని భరోసా కూడా ఇచ్చారు. దీంతో రాజా సింగ్ వచ్చే ఎన్నికల్లో పోటీ చేయనున్నారనే సంకేతాలు కనిపిస్తున్నాయని టాక్.

టీడీపీ ద్వారా రాజకీయ రంగ ప్రవేశం చేసిన రాజాసింగ్ 2014 వరకు కార్పొరేటర్గా పని చేశారు. ఆ తర్వాత బీజేపీలో చేరి వరుసగా 2014, 2018 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలిచారు. గోషామహల్ నియోజకవర్గంలో తన పట్టు పెంచుకున్నారు. కానీ తరచూ వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తారనే రాజాసింగ్ కు పేరుంది. ఓ వర్గంపై అనుచిత వ్యాఖ్యలు చేశారని, పార్టీ విధానాలకు వ్యతిరేకంగా మాట్లాడారని 2022 ఆగస్టులో రాజాసింగ్ పై బీజేపీ సస్పెన్షన్ విధించింది. దీంతో వచ్చే ఎన్నికల్లో రాజాసింగ్ పోటీ చేయడం సందేహంగా మారింది. ఇటీవల తెలంగాణ అసెంబ్లీలోనూ రాజాసింగ్ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. తనకు ఇదే చివరి అసెంబ్లీ సెషన్ కావొచ్చని ఆయన పేర్కొన్నారు.

కానీ ఇప్పుడు రాజాసింగ్ ఆశలు చిగురిస్తున్నట్లే కనిపిస్తున్నాయి. పార్టీ కోసం పని చేసే అలాంటి నాయకుణ్ని బీజేపీ వదులుకునేందుకు సిద్ధంగా లేదని తెలిసింది. టికెట్ రాకుంటే రాజకీయాలు వదిలేస్తా కానీ ఇతర పార్టీల్లోకి వెళ్లనని రాజాసింగ్ ఇప్పటికే చాలా సార్లు స్పష్టం చేశారు. అంతే కాకుండా ప్రాణం పోయినా బీఆర్ఎస్లో కానీ కాంగ్రెస్లో కానీ చేరేదే లేదని కూడా చెప్పారు. ఇండిపెండెంట్ గానూ పోటీ చేయనన్నారు. బీజేపీతోనే ప్రయాణమని లేకుంటే రాజకీయ సన్యాసమేనని చెప్పారు. ఈ నేపథ్యంలో రాజాసింగ్ పై సస్పెన్షన్ ఎత్తివేసేందుకు బీజేపీ సిద్ధమైందని సమాచారం.