ఆ భేటీలో ఏపీని కేసీఆర్ కడిగేస్తారా?

అందరి కోపం వేరు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కోపం వేరుగా చెబుతుంటారు. రెండు తెలుగు రాష్ట్రాల మధ్య ఇరిగేషన్ ప్రాజెక్టుల విషయంలో ఇచ్చిపుచ్చుకునే ధోరణి ఉండాలని చెప్పే ఆయన.. అంతో ఇంతో తమ రాష్ట్రానికి మేలు జరిగేలా జాగ్రత్తలు తీసుకోవటం కనిపిస్తుంటుంది.

తన రాష్ట్రం విషయంలో సీఎం కేసీఆర్ కు ఎలాంటి ప్రత్యేక శ్రద్ధ ఉంటుందో.. ఏపీ ముఖ్యమంత్రి జగన్ కు సైతం అలాంటి వైఖరే ఉంటుందన్న విషయాన్ని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి మర్చిపోవటమే అసలు సమస్యగా చెబుతారు.

గతంలో తాను ప్రతిపాదించిన ప్రాజెక్టును జగన్ నో చెప్పటం తెలిసిందే. ఇదిలా ఉంటే.. రెండు తెలుగు రాష్ట్రాల మధ్య నీటి వాటాలకు సంబంధించిన పంచాయితీ చోటు చేసుకున్నది తెలిసిందే. ఎవరికి వారు.. వారి రాష్ట్రాల ప్రయోజనాల గురించే తప్పించి.. రెండు తెలుగు రాష్ట్రాల ఉమ్మడి ప్రయోజనాల గురించి పెద్ద పట్టింపులు లేనట్లుగా కనిపిస్తుంది.

ఇదిలా ఉండగా..ఈ నెల 25న రెండు తెలుగు రాష్ట్రాలతో కలిపి అపెక్స్ కౌన్సిల్ సమావేశాన్ని నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా తెలంగాణ వైఖరిని స్పష్టం చేయటంతో పాటు.. ఏపీ సర్కారు చేస్తున్న తప్పుల్నిఎత్తి చూపాలన్న విషయాన్ని అధికారులకు సీఎం కేసీఆర్ క్లియర్ గా చెప్పినట్లుగా చెబుతున్నారు. అపెక్స్ కమిటీ భేటీ సందర్భంగా రాష్ట్రం అనుసరించాల్సిన వ్యూహాన్ని కేసీఆర్ సిద్ధం చేసినట్లుగా తెలుస్తోంది.

తెలంగాణ రాష్ట్రంలో చేపట్టిన ప్రాజెక్టులన్ని రీడిజైన్ చేసినవే తప్పించి.. కొత్తగా తెర మీదకు తీసుకొచ్చినవేమీ లేవన్న విషయాన్ని బలంగా చెప్పటమే కాదు.. కొత్త ప్రాజెక్టుల విషయంలో ఏపీ ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరిని బట్టబయలు చేయాలన్న కోపంతో కేసీఆర్ ఉన్నట్లు తెలుస్తోంది. పోతిరెడ్డిపాటు సామర్థ్యం పెంపుతో పాటు.. ఏపీ ప్రభుత్వం చేపట్టిన రాయలసీమ ఎత్తిపోతల పథకంపైన గట్టిగా అభ్యంతరం చెప్పాలన్న విషయాన్ని అధికారులకు స్పష్టం చేసినట్లు తెలుస్తోంది.

మొత్తంగా చూస్తే.. అపెక్సు కౌన్సిల్ సమావేశంలో ఏపీ తీరును కడిగేయాలన్న కోపంలో కేసీఆర్ ఉన్నట్లు చెబుతున్నారు. మరి.. అందుకు సరైన కౌంటర్ ఇచ్చేందుకు వీలుగా ఏపీ సిద్ధం కావాల్సిన అవసరం ఉందన్న మాట వినిపిస్తోంది. మరి.. కేసీఆర్ ప్లాన్ కు జగన్ ఎలా ఎదుర్కొంటారో చూడాలి.