మైనంపల్లి అంటే భయపడుతున్నారా?

మల్కాజ్ గిరి ఎంఎల్ఏ మైనంపల్లి హనుమంతరావు అంటే కేసీయార్ భయపడుతున్నారా ? అందుకనే ఆయనపై డిసిప్లినరీ యాక్షన్ తీసుకోవటానికి వెనకాడుతున్నారా ? అంటే అవుననే అంటున్నాయి పార్టీవర్గాలు. మల్కాజ్ గిరిలో తనకు మెదక్ లో తన కొడుక్కి ఎంఎల్ఏ టికెట్లు కావాలని మొదటినుండి మైనంపల్లి పట్టుబడుతున్నారు. అయితే అందుకు కేసీయార్ అంగీకరించలేదు. మొదటినుండి చెబుతున్నట్లే మల్కాజ్ గిరిలో మాత్రమే మైనంపల్లికి టికెట్ ఇచ్చారు. దాంతో హనుమంతరావు అలిగారు. తన కొడుక్కి టికెట్ రాకపోవటానికి మంత్రి హరీష్ రావే కారణమని ఆరోపణలు చేస్తున్నారు.

తన కొడుక్కి టికెట్ ఇవ్వకపోతే తాను కూడా పోటీ చేసేదిలేదని భీష్మించుకుని కూర్చున్నారు. కేసీయార్ టికెట్లు ప్రకటించినప్పటినుండి మైనంపల్లి పార్టీ ఆఫీసులోకి అడుగు కూడా పెట్టలేదు. పార్టీలో నేతలతో టచ్ లో కూడా లేరు. దాంతో మైనంపల్లి టికెట్ తీసుకున్నారా లేదా అన్నది సస్పెన్సులో పడింది. ఈలోగా కేసీయార్ కూడా ఇద్దరు ముగ్గురు నేతలను మైనంపల్లితో రాయబారానికి పంపితే ఆయన అంగీకరించలేదట.

దాంతో తాజా పరిస్ధితులను భేరీజువేసుకున్న బీజేపీ నేతలు మైనంపల్లితో టచ్ లోకి వెళ్ళారట. ఇద్దరికీ టికెట్లిస్తామని ప్రతిపాదించారట. అయితే కమలంపార్టీలోకి వెళ్ళే విషయమై ఎంఎల్ఏ పెద్దగా సానుకూలంగా లేరని సమాచారం. ఆయన చూపంతా కాంగ్రెస్ మీదుంది. అయితే కాంగ్రెస్ కూడా రెండు టికెట్లిచ్చే పరిస్ధితిలో లేదు. దాంతో ఏమిచేయాలనే విషయంలో పూర్తిగా అయోమయం పెరిగిపోతోంది. బీఆర్ఎస్ లో కొడుక్కి టికెట్ రాదన్నది ఖాయమైపోయింది.

బీజేపీలో ఇస్తామని చెబుతున్నా మైనంపల్లి అటువైపు చూడటంలేదు. కాంగ్రెస్ వైపు చూస్తున్నా ఇక్కడా రెండు టికెట్లు అనుమానమే. మరీ పరిస్ధితుల్లో మైనంపల్లి ఏమిచేయబోతున్నారు ? అన్నది సస్పెన్సుగా మారిపోయింది. మైనంపల్లిని బుజ్జగించాలని కేసీయార్ అనుకోవటం వెనుక పెద్ద కతే ఉందట. అదేమిటంటే మైనంపల్లి పార్టీకి దూరమైతే చుట్టుపక్కల మరో మూడు నియోజకవర్గాల్లో దాని ఎఫెక్ట్ పడుతుందని కేసీయార్ భయపడుతున్నారనే ప్రచారం పెరిగిపోతోంది. అందుకనే రెండో టికెట్ ఇవ్వకుండా, పార్టీని వీడకుండా మైనంపల్లిని బుజ్జగించే బాధ్యతలను సీనియర్ నేతలకు అప్పగించారట. మరి చివరకు ఏమిజరుగుతుందో చూడాలి.