‘ఏపీ అంతా జగన్ కంచుకోటే’

శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురంలో వైసీపీ బలానికి సర్పంచ్ ఎన్నికే నిదర్శనమని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు.రానున్న రోజుల్లో కుప్పంలో ఎమ్మెల్యే సీటు గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు.ఏపీ రాష్ట్రం అంతా సీఎం జగన్ కు కంచుకోటేనని మంత్రి పెద్దిరెడ్డి తెలిపారు.

జగన్ తప్ప 99 శాతం హామీలను పూర్తి చేసిన సీఎం ఎవరూ లేరని చెప్పారు.సీఎం జగన్ తమకు మేలు చేశారని ప్రజలు నమ్ముతున్నారని వెల్లడించారు.హిందూపురంలో దీపిక విజయం కోసం నేతలు అందరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు.ఎన్నికల లోపు కనీసం రెండు, మూడు సార్లు హిందూపురంలో పర్యటించాలని సీఎం జగన్ ను కోరతామని వెల్లడించారు. నకిలీ ఓటర్ల బాగోతాన్ని త్వరలోనే కేంద్ర ఎన్నికల కమిషన్ దృష్టికి తీసుకెళ్తామని అన్నారు.

రాష్ట్రంలో 3 కోట్ల 90 లక్షల ఓట్లు ఉండగా.. అందులో 60 లక్షలు నకిలీవేనని ప్రభుత్వం గుర్తించిందని పేర్కొన్నారు. 2018-2019లో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అవన్నీ ఓటర్ల జాబితాలో చేర్చారని అన్నారు. వాటిమీద చర్యలు తీసుకుంటూ ఉంటే తమ ఓట్లను తీసేస్తోన్నారంటూ టీడీపీ నాయకులు వితండవాదంతో అడ్డుపడుతున్నారని ఆరోపించారు. ఈ 60 లక్షల దొంగఓట్లను కాపాడుకునే ప్రయత్నంలో చంద్రబాబు ఉన్నాడని ధ్వజమెత్తారు. ఈ విషయాన్ని కేంద్ర ఎన్నికల దృష్టికి తీసుకెళ్తామని తేల్చి చెప్పారు.