120 ఎకరాలు కాజేసేందుకు ఏ2 కుట్ర: అయ్యన్న పాత్రుడు!

రాష్ట్రంలో ఉన్న భూములన్నింటిని దొంగలకు ముద్దాయిలకు దోచిపెడుతూ రానున్న తరాలకు భవిష్యత్తు లేకుండా చేస్తున్నాడని ఏపీ ముఖ్యమంత్రి జగన్‌ పై టీడీపీ పోలిట్‌ బ్యూరో సభ్యుడు అయ్యన్నపాత్రుడు విరుచుకుపడ్డారు. ఏపీలో జరుగుతుంది ప్రజా పాలన కాదు. ఓ నిరంకుశ పాలన అంటూ మండిపడ్డారు.

ఏపీలో ఇంతా జరుగుతున్న మేధావులు, విజ్ఙానులు, ప్రజా సంఘాల నాయకులు ఏం చేస్తున్నారని ఆయన ప్రశ్నించారు. మంగళగిరిలోని పార్టీ జాతీయ కార్యాలయంలో మంగళవారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. విశాఖ లోని భీమునిపట్నం తుర్లవాడ కొండపై 120 ఎకరాల భూమిని కాజేందుకు ఏ2 నిందితుడు విజయసాయిరెడ్డి కుట్ర చేస్తున్నారని ఆయన ఆరోపించారు.

తుర్లవాడ ఎంత పుణ్య క్షేత్రమో ఏపీ ప్రజలందరికీ తెలుసు. ఇది ఒక ఆధ్యాత్మిక క్షేత్రం దీని జోలికి రావద్దని ఆయన హెచ్చరించారు. విజయసాయి రెడ్డి తన కుమార్తె విద్యాసంస్థల నిర్మాణం కోసం ఏకంగా 120 ఎకరాల భూమిని కేటాయించాలంటూ కోరినట్లు పేర్కొన్నారు. అంతే కాకుండా జగన్ కూడా సుమారు రూ.300 కోట్లు విలువైన భూమిని ఇచ్చేందుకు ప్రయత్నించారని అయ్యన్న ఆగ్రహం వ్యక్తం చేశారు.

ప్రజల సొమ్మును జగన్‌ రెడ్డి ఇష్టం వచ్చినట్లు దానం చేస్తున్నారు. కొండపై 120 అడుగుల నరసింహస్వామి విగ్రహం ప్రతిష్టించాలని స్థానికులు టీటీడీని కోరుతున్నారని మాజీ మంత్రి తెలిపారు. ఇప్పటికే అటు తిరుమలలో టీటీడీ ఆస్తులు, ఇటు విశాఖలో సింహాచలేశ్వరుని ఆస్తులు దొంగలు అందరూ ఏకమై దోచేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

దేవుడి భూముల వద్దకు మాత్రం రావద్దని జగన్‌ ను కోరుతున్నామన్నారు. అల్రెడీ జగన్‌ ఆయన దొంగ బ్యాచ్‌ అంతా కలిసి రూ. 70 వేల కోట్ల ఆస్తులు దోచుకున్నారని ఆరోపించారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన 6 నెలల్లోనే రుషికొండపై నిర్మాణాలను పడగొడతామని స్పష్టం చేశారు. అధికారంలోకి వచ్చిన వెంటనే జగన్ రెడ్డి దోపిడీ మొత్తం బయటకు తీస్తామని అయ్యన్నపాత్రుడు హెచ్చరించారు.