దళిత బంధుకు మెలికలా ?

తెలంగాణా ప్రభుత్వం అమలుచేస్తున్న అనేక సంక్షేమ పథకాల్లో దళితబంధు పథకం అత్యంత ప్రిస్టేజియస్ అండ్ కాస్ట్లీ పథకం. ఎందుకంటే దళితుల జనాభా చాలా ఎక్కువగా ఉంటుంది పైగా వీళ్ళకి ఇవ్వబోయే డబ్బులు కూడా చాలా ఎక్కువ. అందుకనే ఇది చాలా కాస్ట్లీ పథకమైపోయింది. నిజానికి ఇది అచ్చంగా పొలిటికల్ లబ్దికోసమే రూపొందించిన పథకం అనటంలో ఎలాంటి అనుమానంలేదు. దాదాపు ఏడాది క్రితం జరిగిన హుజూరాబాద్ ఉపఎన్నికలో బీజేపీ తరపున పోటీచేసిన ఈటల రాజేందర్ ను ఓడించేందుకు ప్రకటించిన పథకం.

అయితే పథకాన్ని ప్రకటించినా, కేసీయార్ ఉపఎన్నికల్లో పదేపదే ప్రచారంచేసినా జనాలు మాత్రం ఈటెలనే గెలిపించారు. అప్పట్లో ప్రకటించిన పథకం ప్రకారం ఎంపికైన దళితులందరికీ తలా రు. 10 లక్షలు అందుతుంది. ఆ డబ్బుతో లబ్దిదారులు ఎలాంటి వ్యాపారమైనా చేసుకోవచ్చు. అయితే ఉపఎన్నికలో ఓడిపోవటంతో పథకం అమలు నెమ్మదించింది. అక్కడక్కడ శాంపుల్ గా కొన్ని చోట్ల మాత్రమే పథకం ఆరంభమైంది. రాష్ట్రమంతా అమల్లోకి రాలేదన్నది వాస్తవం.

తొందరలో షెడ్యూల్ ఎన్నికలు జరగబోతున్నాయి కదా అందుకనే కేసీయార్ కు మళ్ళీ దళితులు గుర్తుకొచ్చినట్లున్నారు. ఈ కారణంగానే దళితబంధు పథకాన్ని మళ్ళీ తెరపైకి తీసుకొస్తున్నారు. అయితే వీలైనంతమందికి పథకాన్ని వర్తింపచేయటంలో భాగంగానే రెండు షరతులను తీసుకురాబోతున్నట్లు పార్టీవర్గాల సమాచారం. అదేమిటంటే లబ్దిదారులకు ఒకేసారి 10 లక్షల రూపాయలు అందచేయరట. లబ్దిదారులు పెట్టుకునే వ్యాపారానికి వీలుగా మూడు, నాలుగు విడతల్లో డబ్బులు అందిస్తారట. అలాగే ఈ డబ్బుతో వాహనాలు ఏవీ కొనకూడదనే షరతును కూడా పెట్టబోతున్నారట.

విడతల వారీగా డబ్బులు ఎందుకు ఇవ్వాలని అనుకున్నదంటే వీలైనంతమంది లబ్దిదారులకు పథకాన్ని వర్తిపంచేయటం కోసమేనట. 2023-24 లో పథకం వర్తింపచేయాలంటే 1,29,800 మందికి రు. 18 వేల కోట్లు ఖర్చవుతుందని లెక్కకట్టింది. ఈ మొత్తాన్ని బడ్జెట్లో చూపించిందే కానీ కేటాయించలేదు. పైగా అందరికీ ఒకేసారి డబ్బులు జమచేయాలంటే ప్రభుత్వం దగ్గర కూడా డబ్బులేదు. అందుకనే విడతలవారీగా డబ్బులు జమచేస్తే ఎక్కువమందికి అందించవచ్చు, ఒకేసారి కేటాయించాల్సిన అవసరం కూడా లేదు. మొత్తానికి దళితబంధుకు పెద్ద మెలికే పెట్టబోతోంది ప్రభుత్వం.