అధిష్టానం ఎక్కడ నుంచి అంటే అక్కడ నుంచే: యార్లగడ్డ!

ఏపీ విజయవాడ రాజకీయాల్లో మరో మలుపు చోటు చేసుకుంది. వైసీపీ ముఖ్య నేత యార్లగడ్డ వెంకట్రావు ఆ పార్టీని వీడి తెలుగు దేశం పార్టీలో చేరుతున్నట్లు రెండు రోజుల క్రితం ప్రకటించారు. ఈ క్రమంలోనే ఆయన ఆదివారం చంద్రబాబు నాయుడును ఆయన నివాసంలో కలిశారు.

వారిద్దరూ కాసేపు మాట్లాడుకున్నారు. ఈ నెల 22న గన్నవరంలో జరిగే సభలో టీడీపీ కండువా కప్పుకుంటున్నారు. అనంతరం యార్లగడ్డ మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. డబ్బు సంపాదించాలని తాను రాజకీయాల్లోకి రాలేదన్నారు. ఆరేళ్లుగా వైసీపీకి సేవ చేశానని, మూడున్నర ఏళ్లుగా వైసీపీలో ఎన్నో చూశానన్నారు యార్లగడ్డ.

రాజకీయాల కోసమే అమెరికా వదిలి ఇక్కడకు వచ్చానన్నారు. తన వర్గానికి చెందిన వారికి పదవులు ఇవ్వనప్పుడు మదన పడ్డానన్నారు. పార్టీ ఎక్కడ నుంచి పోటీ చేయమంటే అక్కడే చేస్తానని, గుడివాడలో చేయమన్నా చేస్తానని స్పష్టం చేశారు. వైసీపీలో ఉన్నప్పుడు అనేక అంశాలను ప్రస్తావించానని, హైదరాబాద్‌ మహానగరం అభివృద్ధిలో చంద్రబాబు నాయుడు పాత్ర ఉందని యార్లగడ్డ వెంకట్రావు అన్నారు.

వైసీపీలో మన ఇష్టా ఇష్టాలతో సంబంధం లేదన్నారు. తనకు వైసీపీలో సజ్జల రామకృష్ణారెడ్డి అంటే చాలా ఇష్టమని.. అయితే సజ్జలనే తనపై ఆరోపణలు చేశారని ఆవేదన వ్యక్తం చేశారు యార్లగడ్డ వెంకట్రావు.