రాష్ట్రాన్ని అప్పుల రాష్ట్రంగా చేస్తున్నారు: కిషన్‌ రెడ్డి

పేదల భూములను బీఆర్‌ఎస్‌ వ్యాపారులకు కట్టబెడుతుందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆరోపించారు. సోమవారం ఆయన హైదరాబాద్ లో మీడియాతో మాట్లాడారు. కోకాపేటలోని ఏకంగా 11 ఎకరాల భూమిని  బీఆర్‌ఎస్‌ తీసుకున్నది నిజమా కాదా అంటూ ఆయన ప్రశ్నించారు. బీఆర్‌ఎస్‌ తో పాటు కాంగ్రెస్‌ కూడా కుమ్మక్కై వందల కోట్ల విలువైన భూములను ఆక్రమించుకున్నారని ఆయన ఆరోపించారు. రాబోయే ఎన్నికల్లో తమ రాజకీయ పనుల్లో అవసరమయ్యే డబ్బులు కోసం ఇప్పటి నుంచే భూములను సమకూర్చుకుని..అనంతరం వాటిని అమ్మి ఆ డబ్బులను ఎన్నికల టైమ్‌ లో ఉపయోగిస్తారని ఆయన మండిపడ్డారు.

బీజేపీ అధికారంలోకి వచ్చిన వెంటనే ఆ రెండు పార్టీలకు ఇచ్చిన భూమి పట్టాలను రద్దు చేస్తామని ఆయన హెచ్చరించారు. ప్రభుత్వ భూములను అమ్మడం అంటే ప్రజలను మోసం చేయడమే అని ఆయన పేర్కొన్నారు. ఆ రెండు పార్టీలు కలిసి రాష్ట్రాన్ని అప్పుల రాష్ట్రంగా మారుస్తున్నారన్నారు. ఈ భూముల వేలం అనేది ఒక దుర్మార్గపు చర్య.

సంపద సృష్టించాల్సింది పోయి భూములు అమ్మి నాశనం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. దీని వల్ల వ్యవస్థ కూలిపోతుందని ఆందోళన వ్యక్తం చేశారు. దీని కోసమేనా కేసీఆర్ 80 వేల పుస్తకాలు చదివింది అంటూ ఆయన ఎద్దేవా చేశారు. పేదప్రజలకు ఇళ్లు కట్టడానికి స్థలం కనిపించదు కానీ..పెద్ద వ్యాపారులకు అమ్ముకునేందుకు మాత్రం స్థలాలు కనిపిస్తున్నాయా అంటూ ప్రశ్నించారు.

ముందు తరాల వారికి చెందాల్సిన, ఉపయోగపడాల్సిన భూములను అమ్మడం అనేది సరైన నిర్ణయం కాదని ఆయన అన్నారు. ప్రజల కోసం సైన్స్ సిటీని నిర్మించడానికి భూమి ఇవ్వమంటే ఇవ్వని కేసీఆర్ ..కాంగ్రెస్‌ కార్యాలయం కోసం మాత్రం 10 ఎకరాల భూమిని ఇచ్చారని తెలిపారు. ఉమ్మడి రాష్ట్రంగా ఉన్న సమయంలో రాజశేఖర్‌ రెడ్డి భూములు అమ్మితే కేటీఆర్‌ వ్యతిరేకించారని ఈ సందర్భంగా కిషన్‌ రెడ్డి గుర్తు చేశారు. ఇప్పుడు మాత్రం అధికారంలోకి రాగానే వీరే భూములు అమ్మడం మొదలు పెట్టారని విమర్శించారు.