తన అసలు బలంపై టార్గెట్ చేసిన కాంగ్రెస్

ఒకపుడు కాంగ్రెస్ పార్టీ అంటేనే ఎస్సీ, ఎస్టీలకు వేదిక. ఈ రెండు సామాజిక వర్గాలు ఆరు నూరైనా నూరు ఆరైనా కాంగ్రెస్ పార్టీని వదిలి ఇతరులవైపు వేళ్ళేవి కావు. అలాంటిది ప్రాంతీయ పార్టీల ఆవిర్భావం, బలం పుంజుకోవటంతో కాంగ్రెస్ ఓటు బ్యాంకుకు చిల్లులు పడింది. ఇపుడు కాంగ్రెస్ కు పలానా ఓటు బ్యాంకు సాలిడ్ గా ఉందని చెప్పుకునేందుకు లేకుండా పోయింది. పార్టీ ఓటు బ్యాంకులను ప్రాంతీయ పార్టీలు కొల్లగొట్టేశాయి. అందుకనే తన సంప్రదాయ ఓటుబ్యాంకును మళ్ళీ దగ్గరకు తీసుకునేందుకు హస్తం పార్టీ రెడీ అయ్యింది.

ఇందులో భాగంగానే తెలంగాణలో ఎస్సీ, ఎస్టీల కోసం ప్రత్యేక ప్రణాళికలను వేస్తోంది. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఎస్సీ, ఎస్టీ జనాభా దామాషా ప్రకారం రిజర్వేషన్లను పెంచేందుకు ప్రయత్నిస్తామని హామీ ఇచ్చారు. దళిత, గురిజులకు ఇచ్చే భూములపై సర్వ హక్కులు వాళ్ళకే అందేట్లు చర్యలు తీసుకుంటామని ప్రకటించారు. ఇపుడు తెలంగాణలో ఎస్సీలకు 19 నియోజకవర్గాలు, ఎస్టీలకు 12 నియోజకవర్గాలున్నాయి. ఒకపుడు ఈ 31 నియోజకవర్గాల్లో ఎంతో బలంగా ఉన్న కాంగ్రెస్ ఇపుడు బలహీనపడిపోయింది.

మళ్ళీ ఈ నియోజకవర్గాల్లో గనుక పార్టీ గెలవగలిగితే అధికారంలోకి రావటం ఖాయమని కాంగ్రెస్ సీనియర్లు అంచనాలు వేసుకుంటున్నారు. దానికి తగ్గట్లే ప్రణాళికలు కూడా రెడీచేస్తున్నారు. ఈ నెల 18వ తేదీన ఎస్సీ, ఎస్టీ డిక్లరేషన్ ప్రకటించబోతున్నారు. ఇందుకని చేవెళ్ళల్లో భారీ బహిరంగ సభ నిర్వహిస్తున్నారు. ఆ సభకు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే హాజరవుతున్నారు.

సమాజంలో ఎస్టీల జనాభా తక్కువే అయినా ఎస్సీల జనాభా ఎక్కువగానే ఉంటుంది. ఏ నియోజకవర్గంలో తీసుకున్నా ఎస్టీల జనాభా పెద్దగా లేకపోవచ్చు కానీ ఎస్సీల జనాభానే గెలుపోటములను నిర్ణయించేంగా ఉంటుంది. కాబట్టి దూరమైన ఓటుబ్యాంకులను మళ్ళీ దగ్గరకు చేర్చుకోవటంలో భాగంగానే ప్రత్యేక డిక్లరేషన్లను ప్రకటిస్తోంది. ఇప్పటికే బీసీ, రైతు, మహిళా, యువత డిక్లరేషన్లను ప్రకటించిన విషయం తెలిసిందే. మరిన్ని డిక్లరేషన్లను ప్రకటిస్తున్న కాంగ్రెస్ అధికారంలోకి వస్తే అన్నింటినీ అమలు చేయగలుగుతుందా అన్నదే అనుమానంగా ఉంది. ఎందుకంటే ఎన్నికల్లో గెలుపుకోసం ఎలాంటి హామీలైన నేతలు ఇచ్చేస్తారు కదా.