అవిశ్వాసం నెగ్గుతారు.. `విశ్వాసం` మాటేంటి?

కేంద్రంలోని న‌రేంద్ర మోడీ స‌ర్కారుపై కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలోని ఇండియా కూట‌మి అవిశ్వాస తీర్మా నం ప్ర‌వేశ పెట్టిన విష‌యం తెలిసిందే. దీనిపై రెండు రోజుల నుంచి చ‌ర్చ సాగింది. చివ‌రి రోజు ప్ర‌ధాన మంత్రి ప్ర‌సంగించి.. విప‌క్షాలు లేవ‌నెత్తిన ప్ర‌శ్న‌ల‌కు స‌మాధానం ఇవ్వ‌డంతో ఈచ‌ర్చ ముగిసిపోయింది. అనంత‌రం ఓటింగ్ నిర్వ‌హిస్తారు. గెలుపు మ‌రోసారి మోడీ ప‌క్షానికే ద‌క్కింది. ఎందుకంటే ఎన్డీయే కూట‌మికి 331 మంది స‌భ్యుల మ‌ద్ద‌తు ఉంది.

సో.. రాజ్యాంగం ప్ర‌కారం ప్ర‌తిప‌క్షాల‌కు ద‌ఖ‌లు ప‌డిన అధికారం అవిశ్వాసం. ఆర్టిక‌ల్ 75(3) అవిశ్వాస తీర్మానాన్ని విప‌క్షాల‌కు అందించింది. అయితే.. ఈ విష‌యాన్ని కొంత లోతుగా ప‌రిశీలిస్తే.. ప్ర‌స్తుతం బీజేపీ నాయ‌కులు కానీ, అధికారంలో ఉన్న‌వారు కానీ.. దీనిని తేలిక‌గా తీసుకోవ‌చ్చు. పార్ల‌మెంటులో బీజేపీ ఎంపీ ఒక‌రు చెప్పిన‌ట్టు విప‌క్షాల‌కు ప‌నిలేక ఈ అవిశ్వాస తీర్మానం ప్ర‌వేశ‌పెట్టార‌ని మిగిలిన స‌మాజాన్ని వారు న‌మ్మించే ప్ర‌య‌త్నం చేయ‌నూ వ‌చ్చు.

కానీ, అదే రాజ్యాంగం ఓ కీల‌క ప్ర‌క‌ట‌న కూడా చేసింది. ఆర్టికల్ 75(3)లోనే స‌భ్యుల విశ్వాసాన్ని ప్ర‌భుత్వం చూర‌గొనాలి- అని పేర్కొంది. ఇక్క‌డ స‌భ్యులు అంటే.. కేవ‌లం పార్టీ జెండాలు మోసేవారు కాదు. ప్ర‌జా ప్ర‌తినిధులుగా ఉన్న‌వారు అని. అంటే.. ప్ర‌జ‌ల విశ్వాస‌మే త‌మ‌దిగా భావించేవార‌ని అర్థం. అలా చూసు కున్నప్పుడు.. అస‌లు అవిశ్వాస తీర్మానం అనే మాటే తెర‌మీదికి వ‌చ్చేది కాద‌ని రాజ‌కీయ నిపుణులు, రాజ్యాంగ నిపుణులు కూడా చెబుతున్నారు.

గ‌తంలో వాజ‌పేయి ప్ర‌భుత్వంపై అవిశ్వాస తీర్మానం ప్ర‌వేశ పెట్టిన‌ప్పుడు.. ఆయ‌న దీనిని అవ‌మానాన్ని మించిన భారంగా భావిస్తున్నాన‌ని నిండు స‌భ‌లో పేర్కొన్నారు. పాపం .. అప్ప‌ట్లో ఆయ‌న‌కు స‌భ్యుల‌ను కొన‌డం  చేత‌కాక‌.. ఇలా అని ఉంటార‌ని ఇటీవ‌ల కొన్ని వ్యాఖ్యానాలు వ‌చ్చాయి. స‌రే.. ఆయ‌న చెప్పిన దానిలో కీల‌క విష‌యం.. అవిశ్వాసం అంటే.. ఏదో నామ్‌కేవాస్తే పార్ల‌మెంటులో పెట్టేసి.. అధికార, విప‌క్షాలు ఒక‌రిపై ఒక‌రు గ‌లాభా చేసుకునే ఉద్దేశం కాదు.

అసలు దీనికి రాజ్యాంగంలోనే ఇంత పెద్ద అవ‌కాశం, చోటు క‌ల్పించ‌డం వెనుక రాజ్యాంగ నిర్ణేత‌ల నిశిత దృష్టి.. ప్ర‌భుత్వం విష‌యంలో వారు గీసిన ల‌క్ష్మ‌ణ రేఖ వంటివాటిని అర్ధం చేసుకోవాల్సి ఉంటుంది. “ఇదిగో.. మీరు క‌నుక బాధ్య‌త మ‌రిచిపోయినా.. అదుపు త‌ప్పినా.. నిద్రాణంగా ఉన్నా.. అవిశ్వాసం అనే కొర‌డా ఒక‌టి ఉంటుంది“ అని రాజ్యాంగం హెచ్చ‌రించింది. అంటే.. ఈతీర్మానంలో ఎవ‌రు గెలుస్తారు? ఎవ‌రు ఓడ‌తారు? అనేదానికంటే.. అస‌లు ఈ చ‌ర్చ వ‌చ్చిందంటేనే.. వాజ‌పేయి చెప్పిన‌ట్టు ప్ర‌భుత్వం సిగ్గు ప‌డాల్సి ఉంటుంది. త‌న పాల‌న‌ను తాను స‌మీక్షించుకోవాల్సి ఉంటుంది. మ‌రి ఇప్పుడు ఆవిజ్ఞ‌త ఉంటుందా? అంటే.. మిలియ‌న్ డాల‌ర్ల ప్ర‌శ్న‌గానే మారింది.