ప‌వ‌న్ దెబ్బ‌తిన్న పులి.. కోరుకున్న‌ది ద‌క్కుతుంది!

జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్‌కు టాలీవుడ్ నుంచి మ‌ద్ద‌తు ల‌భిస్తోంది. ఇది సినిమాల ప‌రంగా కాదు. రాజకీయ ప‌రంగానే ఆయ‌న‌కు ద‌న్నుగా నిలిచేవారి సంఖ్య పెరుగుతుండ‌డం గ‌మ‌నార్హం. తాజాగా మాట‌ల మాంత్రికుడు.. ఫైర్ కామెంట్ల ఫ్యాక్ట‌రీగా పేరొందిన ప‌రుచూరి గోపాల కృష్ణ జ‌న‌సేనానికి మ‌ద్ద‌తుగా నిలిచారు. ప‌వ‌న్‌ను దెబ్బ‌తిన్న పులిగా పోల్చారు. ఆయ‌న దెబ్బ‌తిన్న పులికి ఎంత పౌరుషం ఉంటుందో అంతే పౌరుషంతో ప్ర‌జ‌ల్లోకి వ‌స్తున్నార‌ని.. ప‌వ‌న్ కోరుకున్న‌ది (అధికారం) ద‌క్కి తీరుతుంద‌ని గోపాల కృష్ణ వ్యాఖ్యానించారు.

సమాజం మారాలంటే అప్పుడప్పుడు అధికారం చేతులు మారుతుండాలి అని ప‌రుచూరి అన్నారు. అంతేకాదు.. ఏపీ ప్ర‌భుత్వాన్ని ప‌రోక్షంగా ఉద్దేశిస్తూ.. ఒకరి చేతుల్లోనే అధికారం ఉండకూడదని చెప్పుకొచ్చారు. అప్పుడే ప్ర‌జ‌ల‌కు మేలు జ‌రుగుతుంద‌న్నారు. మార్పు కోస‌మే గత ఎన్నికల్లో పవన్‌ కల్యాణ్‌ పోటీ చేశారని, అయితే, ఆయ‌న రెండు చోట్లా ఓడిపోయార‌ని.. రాజ‌కీయాల్లో ఒక్కొక్క‌సారి ఇలానే జ‌రుగుతుంద‌ని ప‌రుచూరి గోపాల కృష్ణ అన్నారు. ఆ ఫలితాలతో నిరాశ చెందకుండా దెబ్బతిన్న పులిలా మళ్లీ వస్తున్నాడ‌ని ప‌వ‌న్‌ను ఉద్దేశించి చెప్పారు.

“ఎన్నిక‌ల్లో ఓటింగ్‌ అనేది ఒక పెద్ద రాజకీయ తంత్రం. పాలిటిక్స్‌లో ఎన్నో ఎదురుదెబ్బలు తగులుతుంటాయి. వాటిని ఎదుర్కొని ముందుకు సాగాలి. అలాగే సమాజం గురించి రాజకీయ నేత‌లు చెబితే వినేవారికంటే.. సినిమా నటుడు చెబితే వినేవాళ్లు ఎక్కువ మంది ఉంటారు. పవన్‌ బాగుండాలని కోరుకునే వారిలో నేనూ ఒకడిని” అని ప‌రుచూరి గోపాల కృష్ణ చెప్పారు. రాజ‌కీయాల్లో ప‌వ‌న్ బిజీ అయిపోవాల‌ని.. ఆయ‌న కోరుకున్న‌ది కూడా జ‌ర‌గాల‌ని గోపాల కృష్ణ చెప్పారు.

అయితే, పవన్‌ కల్యాణ్‌ను సినిమాలు చేయడం ఆపేయవద్దని ఎప్పటికీ కొనసాగించాలని పరుచూరి కోరారు. సమయం లేకపోతే గ‌తంలో అధికారంలో ఉండి కూడా అన్న‌గారు ఎన్టీఆర్ సినిమాల్లో న‌టించిన‌ట్టుగా అప్పుడప్పుడైనా ప‌వ‌న్‌ సినిమాల్లో కనిపించాలని సూచించారు. అలాగే పవన్‌ కోరుకున్నది ఆయనకు దక్కాలని పరుచూరి చెప్పారు.