బ‌య‌ట ప‌డుతున్న మోడీ విశ్వ‌రూపం..

నా నోట్లో నీ వేలు పెట్టు.. నీ కంట్లో నా వేలు పెడ‌తా! అంటే.. ఎలాంటి వారైనా అంగీక‌రిస్తారా?  కానీ, ఇలాంటి వారికి తాము అన్ని విధాలా మ‌ద్ద‌తుగా ఉంటామ‌ని ప‌రోక్షంగా చెప్పేశారు కేంద్ర మంత్రి అమిత్‌షా! ఇదే.. త‌మ నైజ‌మ‌ని ఆయ‌న చెప్ప‌క‌నే చెప్పారు. త‌మ‌కు అనుకూలంగా ఉంటే చాలు.. వారి జోలికి వెళ్ల‌నే వెళ్ల‌మ‌ని ఆయ‌న పార్ల‌మెంటు వేదిక‌గా చెప్పేశారు. “ఔను.. ఎందుకు ఆ ముఖ్య‌మంత్రిని ప‌ద‌వి నుంచి తీసేయాలి? మాకు అన్ని విధాలా స‌హ‌క‌రిస్తున్నారు. ఏమైనా తేడా వ‌స్తే.. మేం ఊరుకుంటామా?  వెంట‌నే తీసి ప‌క్క‌న పెట్టేయ‌మా?” అని నిండు పార్ల‌మెంటులో అమిత్ షా చేసిన వ్యాఖ్య‌లు.. దేశంలోని వివిధ రాష్ట్రాల్లో చోటు చేసుకున్న ప‌రిణామాల‌కు ముడి పెట్టి చూస్తే..నివ్వెర‌పోవ‌డం ఖాయం.

అస‌లు ఏం జ‌రిగింది?

ఈశాన్య రాష్ట్రం మణిపూర్లో చోటు చేసుకున్న‌ హింసాత్మక ఘటనలకు సంబంధించి ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎన్.బీరేన్ సింగ్‌ను తప్పించకపోవడంపై కేంద్ర హోం మంత్రి అమిత్‌షా తాజాగా లోక్‌సభలో అవిశ్వాస తీర్మానంపై చర్చ సందర్భంగా వివరించారు. “ఒక ముఖ్యమంత్రి సహకరించక పోతే ఆయనను తప్పించాల్సిన పరిస్థితి వస్తుంది. తప్పిస్తాం కూడా. కానీ మణిపూర్ సీఎం బీరేన్ సింగ్ పూర్తిగా కేంద్రానికి సహకరిస్తున్నారు. అలాంట‌ప్పుడు ఆ ప్ర‌శ్నే ఉత్ప‌న్నం కాదు.” అని ఆయ‌న వ్యాఖ్యానించారు. దీంతో నివ్వెర పోవ‌డం విప‌క్షాల వంతే కాదు.. ప్ర‌జాస్వామ్య వాదుల వంతు కూడా అయింది.

ఎందుకంటే.. మ‌ణిపూర్‌లో ఇద్ద‌రు మ‌హిళ‌ల‌ని పైకి చెబుతున్నా.. అన‌ధికార వార్త‌ల ప్ర‌కారం సుమారు 100 మంది మ‌హిళ‌ల‌ను మైతేయి తెగ‌వారు కుకీల‌ను న‌గ్నంగా ఊరేగించారు వారిని బ‌హిరంగంగానే అత్యాచారం చేశార‌ని స్థానిక మీడియా చెబుతోంది. ఇక‌, హింసాత్మ‌క ఘ‌ట‌న‌లు నేటికీ జ‌రుగుతూనే ఉన్నాయి. మ‌య‌న్నార్ దేశాన్ని ఆనుకుని ఉన్న ఈ రాష్ట్రంలో చోటు చేసుకు న్న ప‌రిణామాల‌పై అంత‌ర్జాతీయ మీడియా కూడా ఆందోళ‌న వ్య‌క్తం చేస్తోంది. ఇంత జ‌రుగుతున్నా.. `మా మాట వినేవాడు ఉన్నాడు“ అనే ఒకే ఒక్క‌కార‌ణంగా కేంద్రంలోని మోడీ స‌ర్కారు మౌనం వ‌హించ‌డం గ‌మ‌నార్హం.

అందుకే ఈ రాష్ట్రాల్లో ఇలా జ‌రిగిందా?

అమిత్ షా చెప్పిన‌ట్టు కేంద్రంలోని న‌రేంద్ర మోడీ స‌ర్కారుకు స‌హ‌క‌రించే ప్ర‌భుత్వాల‌కు కేంద్రం ద‌న్నుగా ఉంద‌నే విష‌యం.. ఏపీ, ఒడిశా వంటి రాష్ట్రాల‌ను చూస్తే తెలుస్తోంద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. ఇక‌, ఏమాత్రం తేడా వ‌చ్చినా తెలంగాణ‌, ప‌శ్చిమ బెంగాల్‌, త‌మిళ‌నాడు, మ‌హారాష్ట్ర‌ (ఏకంగా స‌ర్కారునే కూల్చేశారు) వంటి రాష్ట్రాల్లో జ‌రుగుతున్న ప‌రిణామాలే ఉంటాయ‌ని.. మ‌రోసారి రూఢీ అయింద‌ని ప‌రిశీల‌కులు అంటున్నారు. ఈ విష‌యం ఇప్పుడు పార్ల‌మెంటు వేదిక‌గా రూఢీ అయింద‌ని చెబుతున్నారు.