చిత్తూరు జిల్లా తంబళ్లపల్లె నియోజకవర్గంలోని అంగళ్లు ప్రాంతంలో జరిగిన ఘర్షణల నేపథ్యంలో టీడీపీ అధినేత చంద్రబాబుపై హత్యా నేరం కేసు నమోదైన సంగతి తెలిసిందే. చంద్రబాబుతో పాటు మాజీ మంత్రి దేవినేని ఉమా తదితరులపై పోలీసులు కేసు నమోదు చేయడం ఏపీ రాజకీయాల్లో సంచలనం రేపింది. ఈ నేపథ్యంలోనే తనపై పెట్టిన కేసు వ్యవహారంపై చంద్రబాబు తొలిసారిగా స్పందించారు. అంగళ్లు ఘర్షణల నేపథ్యంలో తనపై కేసు నమోదు చేయడాన్ని చంద్రబాబు ఖండించారు. అంగళ్లులో తనను హత్య చేయడానికి కుట్ర చేశారని ఆరోపించారు. ఆ హత్యాయత్నానికి పోలీసుల సహకారం కూడా ఉందని షాకింగ్ కామెంట్స్ చేశారు.
టీడీపీ క్యాడర్ పై కూడా దాడులు చేస్తున్నారని, ఇప్పుడు తనపై కూడా కేసులు పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అసమర్ధ నేత సీఎం అయితే వ్యవస్థలు ఇలాగే ఉంటాయని జగన్ పై విమర్శలు గుప్పించారు. తమను చంపి రాజకీయాలు చేస్తారా? ప్రభుత్వం దుర్మార్గంగా వ్యవహరిస్తోంది అని చంద్రబాబు మండిపడ్డారు. అంగళ్లు అల్లర్లపై సిబిఐతో విచారణ జరిపించాలని, తనను చంపడానికి ప్రయత్నించింది ఎవరో విచారణలో తేలాలని డిమాండ్ చేశారు.
సైకో సీఎం ఆదేశాలతోనే తనను రాయలసీమలో పర్యటించనివ్వడం లేదని, ప్రజల తరఫున పోరాడకుండా అడ్డుకుంటున్నారని ఆరోపించారు. తనను హత్య చేసేందుకు ప్రయత్నించారని, ఎక్కడికెళ్లిన తనపై దాడులు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్ ఎస్ జి భద్రత ఉన్న తనకే రక్షణ లేకపోతే, తానే పారిపోతే ఇక అర్థం ఏముందని ప్రశ్నించారు. వైసిపి అవినీతిని, దోపిడీని దౌర్జన్యాలను ఎదుర్కొని తీరుతానని చంద్రబాబు సవాల్ చేశారు.
మూర్ఖత్వపు పాలనతో రాష్ట్రాన్ని జగన్ సర్వనాశనం చేశాడని నిప్పులు చెరిగారు. అబద్దాలకోరు, కరుడుగట్టిన నేరస్థుడు, మూర్ఖుడు, సైకో అందరి జీవితాలను నాశనం చేశాడని ఆరోపించారు. రోడ్లు బాగు చేయలేని ఈ ముఖ్యమంత్రి రాష్ట్రాన్ని బాగు చేస్తారా అని ఎద్దేవా చేశారు.దుర్మార్గుడు జగన్ వచ్చాక రాష్ట్రంలో అరాచకం పెరిగిందని దుయ్యబట్టారు. జగన్ వంటి దుర్మార్గుడు రాజకీయాల్లో ఉండటానికి అనర్హుడని, వైసిపిని బంగాళాఖాతంలో కలిపితేనే రాష్ట్రానికి మోక్షం లభిస్తుందని ప్రజలకు పిలుపునిచ్చారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates