పంతం నెగ్గించుకున్న మోడీ.. ఢిల్లీ అధికారాల‌పై బిల్లు పాస్‌

దేశ‌రాజ‌ధాని ప్రాంత‌మైన ఢిల్లీ రాష్ట్రంపై స‌ర్వ‌స‌త్తాక అధికారాల‌ను త‌న చేతిలో పెట్టుకునేందుకు ఉద్దేశిం చిన ఢిల్లీ స‌ర్వీసుల బిల్లును కేంద్రంలోని న‌రేంద్ర మోడీ స‌ర్కారు పంతం ప‌ట్టి మ‌రీ  ఆమోదించుకుంద‌నే అభిప్రాయం వ్య‌క్త‌మ‌వుతోంది. ఇప్ప‌టికే లోక్‌స‌భ‌లో సునాయాసంగా ఈ బిల్లు ఆమోదం పొందిన ద‌రిమిలా.. సోమ‌వారం సాయంత్రం దీనిని రాజ్య‌స‌భ‌లో ప్ర‌వేశ పెట్టారు. దీనిపై సుదీర్ఘంగా 4 గంట‌ల పాటు స‌భ‌లో చ‌ర్చ‌సాగింది.

అధికార, ప్ర‌తిప‌క్షాల మ‌ధ్య మాట‌ల యుద్ధంతోపాటు.. చ‌ర్చ‌ల‌కు వేదిక‌గా మారిన రాజ్య‌స‌భ‌లో.. చివ‌ర‌కు నిర్వ‌హించిన ఓటింగ్‌లో ‘గవర్నమెంట్‌ ఆఫ్‌ నేషనల్‌ క్యాపిటల్‌ టెరిటరీ ఆఫ్‌ ఢిల్లీ స‌వ‌ర‌ణ బిల్లు–2023’ను రాజ్య‌స‌భ ఆమోదించింది. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ షా బిల్లును సభలో ప్రవేశపెట్టారు. సుదీర్ఘ చర్చల‌ అనంతరం సోమ‌వారం రాత్రి 9 గంట‌ల స‌మ‌యంలో సభాపతి స్థానంలో ఉన్న ఉప స‌భాప‌తి హ‌రివంశ్ సింగ్ నారాయ‌ణ‌ ఓటింగ్‌ నిర్వహించారు.

బిల్లుకు అనుకూలంగా 131 మంది ఎంపీలు, వ్యతిరేకంగా 102 మంది ఎంపీలు ఓటువేశారు. దీంతో బిల్లు ఆమోదానికి కావాల్సిన మెజారిటీ ఓట్లుల‌భించాయ‌ని స‌భాప‌తి ప్ర‌క‌టిస్తూ.. బిల్లు ఆమోదం పొందిన‌ట్టు తెలిపారు. ఈ బిల్లును రాష్ట్రపతి ఆమోదం కోసం పంప‌నున్నారు. రాష్ట్ర‌ప‌తి ద్రౌప‌ది ముర్ము సంతకంతో బిల్లు చట్టరూపం దాల్చనుంది.

ప్రస్తుతం రాజ్యసభలో మొత్తం సభ్యుల సంఖ్య 238. అధికార ఎన్డీయేతోపాటు ఈ బిల్లు విషయంలో ఆ కూటమికి అనుకూలంగా ఉన్న సభ్యుల సంఖ్య 131. వారంతా బిల్లుకు మద్దతు పలికారు. ఇక విపక్ష ‘ఇండియా’ కూటమితోపాటు ఇతర విపక్ష సభ్యుల సంఖ్య 104 ఉండగా, బిల్లుకు వ్యతిరకంగా 102 ఓట్లు మాత్రమే వచ్చాయి. మిగిలిన‌ సభ్యులు ఓటింగ్‌లో పాల్గొనలేదు.

మొత్తానికి న్ర‌ధాని న‌రేంద్ర మోడీ, హోం మంత్రి అమిత్ షాలు పంతం ప‌ట్టి మ‌రీ ఢిల్లీపై పట్టుబిగించ‌డం గ‌మ‌నార్హం. నిజానికి రాజ‌కీయాల్లో పంతాలు ప‌ట్టింపులు కామ‌నే. కానీ, కేంద్ర పాలిత ప్రాంతం పేరుతో పూర్తిగా త‌మ‌కే అధికారాలు ద‌క్కేలా వ్య‌వ‌హరించడం.. ఈ నేప‌థ్యంలో ఇత‌ర పార్టీల‌ను కూడా త‌మ వైపు మ‌లుచుకోవ‌డం.. వంటివే ఇప్పుడు చ‌ర్చ‌కు దారితీస్తున్నాయి. ఏదేమైనా మోడీ పంతం అయితే.. నెగ్గేసింది.