కాంగ్రెస్ ఆశలన్నీ వైసీపీ పైనేనా ?

వినడానికి విచిత్రంగా ఉన్నా నిజమంటున్నారు హస్తం పార్టీ నేతలు. ఇంతకీ విషయం ఏమిటంటే షెడ్యూల్ ఎన్నికలు మరో తొమ్మిది నెలల్లో ఉంది. వైసీపీ ఒంటరి పోటీకి రెడీ గా ఉంది. టీడీపీ, జనసేన, బీజేపీ వ్యవహారం ఏమీ తేలలేదు. ఈ మూడు పార్టీల వ్యవహారం తేలకుండా కాంగ్రెస్, వామపక్షాల విషయంలో క్లారిటిరాదు. ఎందుకంటే టీడీపీ, జనసేనతో బీజేపీ గనుక లేకపోతే కాంగ్రెస్ లేదా వామపక్షాలు టీడీపీ, జనసేనతో కలిసే అవకాశముంది. ఒకవేళ కాంగ్రెస్ కలవకపోయినా వామపక్షాలు కలుస్తాయి.

ఈ నేపధ్యంలోనే కాంగ్రెస్ పరిస్థితి ఏమిటనే విషయమై ఆసక్తికరమైన చర్చ మొదలైంది. ఎలాగంటే రాబోయే ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి సిట్టింగ్ ఎంఎల్ఏల్లో కనీసం 40 మందికి టికెట్లు ఇవ్వరనే ప్రచారం అందరికీ తెలిసిందే. మరి టికెట్లు దక్కని 40 మంది ఏమిచేస్తారు ? ఊరికే అయితే కూర్చోరు కదా. ఇక్కడే టికెట్లు దక్కని ఎంఎల్ఏల పయనం ఎటువైపు ఉంటుందనే చర్చలు జోరందుకున్నాయి. టీడీపీ, జనసేనలోకి వెళ్ళే అవకాశాలు తక్కువున్నాయి.

కాబట్టి ఆ ఎంఎల్ఏల్లో ఎక్కువమంది ప్రయాణం తమపార్టీ వైపే ఉంటుందని కాంగ్రెస్ నేతలు అనుకుంటున్నారు. ఎన్నికల్లో పోటీ చేయాలని పట్టుదలగా ఉన్న సిట్టింగుల్లో అత్యధికులకు కాంగ్రెస్ మాత్రమే ఆప్షన్ గా ఉంది. బీఆర్ఎస్ పార్టీ పరిస్ధితి ఏమిటో ఎవరికీ తెలీదు. ఆ పార్టీ తరపున ఎవరూ చప్పుడు కూడా చేయటం లేదు. కాబట్టి ఆ పార్టీ గురించి ఇపుడైతే ఎవరు ఆలోచించటం లేదని సమాచారం.

కాంగ్రెస్ కు కూడా చెప్పుకోదగ్గ నేతలు లేరు. పైగా పాతకాపులన్న కోణంలో ఢిల్లీలో పెద్దలు ఏపీలోని నేతలతో మాట్లాడే ప్రయత్నాలు మొదలు పెట్టారట. పార్టీని వదిలి వెళ్ళిన నేతలంతా తిరిగి రావాలని రిక్వెస్టులు చేస్తున్నారు. ఆ రిక్వెస్టులు కొందరైనా సానుకూలంగా స్పందించకపోతారా అనే ఆశతో కాంగ్రెస్ నేతలు ఎదురుచూస్తున్నారు. పైగా ఈ చేరికలు కూడా రాయలసీమ నుండే ఎక్కువగా ఉంటుందని అనుకుంటున్నారు. రాహుల్, ప్రియాంక గాంధీ గనుక రెండు మూడు సార్లు వరుసగా పర్యటిస్తే మంచి రిజల్టు ఉంటుందని హస్తం పార్టీ నేతలు అంచనాలు వేసుకుంటున్నారు. మరి చివరకు ఏమి జరుగుతుందో చూడాలి.