స్పీకరే అలిగారా ? వాకౌట్ చేశారా ?

పార్లమెంటు సమావేశాల్లో విచిత్రమైన ఘటన చోటుచేసుకుంది. అదేమిటంటే సభ్యుల ప్రవర్తనపై స్పీకర్ ఓంబిర్లా అలిగారు. సభలో సభ్యుల ప్రవర్తన పై కోపం వచ్చి కుర్చీలో నుంచి లేచి వెళ్ళిపోయారు. అంటే ఒక విధంగా స్పీకర్ లోక్ సభ నుంచి వాకౌట్ చేశారనే అనుకోవాలి. ఇంతకీ స్పీకర్ కు అంత కోపం రావటానికి కారణం ఏమిటి ? ఏమిటంటే సభలో సభ్యులు ఎవరు తన మాటను వినటం లేదు, పట్టించుకోవటంలేదట. ఎందుకంటే మణిపూర్ ఘటనలపై చర్చ విషయంలో ఇటు అధికార అటు ఇండియా కూటమి, ప్రతిపక్షాల సభ్యుల మధ్య గొడవలు అవుతుందటమే.

పార్లమెంటు వర్షాకాల సమావేశాలు మొదలైన దగ్గర నుండి మణిపూర్ అల్లర్లపై చర్చకు ప్రతిపక్ష పార్టీలు పట్టుబట్టాయి. మణిపూర్లో ఘటనలు ప్రపంచంలోనే దేశం పరువును తీసేశాయి కాబట్టి ఆ ఘటనలపై దీర్ఘకాలిక చర్చలు జరగాలని ప్రతిపక్షాలు పట్టుబట్టాయి. అయితే మణిపూర్ అల్లర్లపై దీర్ఘకాలిక చర్చలు అవసరం లేదని, స్వల్పకాలిక చర్చలు సరిపోతుందని ఎన్డీయే పదేపదే అంటోంది. ఇదే విషయమై ఇరువైపులా మధ్యేమార్గం సాధ్యం కాకపోవటంతో గొడవలు ఎంతకూ తేలటంలేదు.

ప్రతిపక్షాల డిమాండ్ ప్రకారం సుదీర్ఘ చర్చకు అనుమతిస్తే ప్రభుత్వం పరువు పోవటం ఖాయం. పార్లమెంటు వేదికగా ప్రతిపక్షాల దెబ్బకు నరేంద్రమోడీ పరువు పోతుంది. ఎందుకంటే పార్లమెంటులో చర్చలు జరిపేందుకు సమాధానం చెప్పేందుకు మోడీ వెనకాడుతున్నారు. అందుకనే ప్రతిపక్షాలకు అవకాశం ఇవ్వకూడదనే దీర్ఘకాలిక చర్చకు అధికారపార్టీ అనుమతించటంలేదు.

ఇదే విషయమై ప్రతిరోజు సభలో గొడవలవుతున్నాయి. ఈ విషయంలో స్పీకర్ సర్ది చెప్పాలని ఎంత ప్రయత్నించినా ఎవరు వినటం లేదు. తన మాట విననపుడు ఇక తాను స్పీకర్ గా ఉండి ఉపయోగం ఏమిటని ఓంబిర్లాకు మండిపోయింది. అందుకనే సభ్యులపై కోపంతోను, అలకతోను సభనుండి వెళ్ళిపోయారు. సభ్యుల్లో మార్పు వచ్చేంతవరకు తాను సభలోకి అడుగుపెట్టేది లేదని తెగేసి చెప్పారు. సభ నడిచే విషయంలో ముందు అధికారపక్షమే ఎక్కువ బాధ్యత తీసుకోవాల్సుంటందని ఏళ్ళపాటు రాజకీయాల్లో ఉన్న బిర్లాకు తెలీదా ? మణిపూర్లో అల్లర్లపై చర్చించటానికన్నా మించిన ప్రధాన్యతా అంశం ఏముంది ?