పార్లమెంటులో ‘ఇండియా’ రెచ్చిపోవటం ఖాయమా ?

పార్లమెంటులో ఇండియా కూటమి రెచ్చిపోవటం ఖాయంగా కనిపిస్తోంది. ఎందుకంటే మణిపూర్లో రెండురోజుల పాటు ఇండియా కూటమి తరపున 21 మంది ఎంపీలు పర్యటించి ఢిల్లీకి చేరుకున్నారు. తమ పర్యటనలో ఎంపీల బృందం ఇటు కుకీలు అటు మొయితీ తెగల నేతలతో సమావేశమయ్యారు. రెండు తెగల వాదనలు విన్నారు. మధ్యే మార్గంగా సమస్యల పరిష్కారానికి ఎంపీలు తమ సూచనలు, సలహాలు ఇచ్చారు. తర్వాత తమ పర్యటనలో తాము చూసింది, గ్రహించింది, సమస్యలు, పరిష్కారాలతో గవర్నర్ కు ఒక రిపోర్టిచ్చారు.

అక్కడి నుంచి తిరిగి ఢిల్లీకి చేరుకున్నారు. కూటమిలోని అధినేతలందరికీ తమ రిపోర్టు కాపీలను సర్క్యులేట్ చేశారు. దాంతో ఈరోజు జరగబోయే పార్లమెంట్ సమావేశాల్లో దీనిపైనే కూటమి ఎంపీలు మాట్లాడేందుకు ప్రయత్నించే అవకాశాలున్నాయి. ఇప్పటికే కూటమి తరపున ప్రతిపాదించిన అవిశ్వాస నోటీసును లోక్ సభ స్పీకర్ ఓకే చేశారు. చర్చను ఎప్పుడు జరపాలి, ఓటింగ్ ఎప్పుడు జరుగుతుందనే విషయాన్ని స్పీకర్ ప్రకటించాల్సుంది. బహుశా ఆగస్టు 2,3 తేదీల్లో చర్చ, ఓటింగ్ జరిగే అవకాశముందని అనుకుంటున్నారు.

ఇంతలోనే మణిపూర్ లో పర్యటించిన ఎంపీల బృందం ఢిల్లీకి చేరుకుంది. కాబట్టి అవిశ్వాస తీర్మానానికి ముందే పార్లమెంటులో చర్చను లేవదీసేందుకు ఎంపీలు ప్రయత్నిస్తారు. దాన్న కచ్చితంగా ఎన్డీయే కూటమి అడ్డుకునే ప్రయత్నం చేస్తుంది. దాంతో రెండు వైపుల నుండి గొడవలు జరగటం ఖాయం. మరీ పరిస్ధితిని నివారించేందుకు స్పీకర్ ఏమి చర్యలు తీసుకుంటారో చూడాలి.

స్పీకర్ ముందున్న మార్గం ఒకటే. సభా నిర్వహణకు అంతరాయం కలిగిస్తున్నారని చెప్పి ఎంపీలను బయటకు పంపేయటమే. అయితే అంతమాత్రాన సమస్య పరిష్కారమవ్వదు. ఎందుకంటే బయటకు వెళ్ళిపోయిన ఎంపీలకు బదులు సభల్లో ఉన్న ఎంపీలు గోల మొదలుపెడతారు. అప్పుడు స్పీకర్ అయినా ఎంతమంది ఎంపీలను బయటకు గెంటేస్తారు ? కాబట్టి అవినాశ్వ తీర్మానంపై చర్చను వెంటనే మొదలుపెడితే ఎలాంటి గోలుండదు. కానీ స్వయంగా మణిపూర్లో తిరిగొచ్చిన ఎంపీల బృందం ఏ పాయింట్లను లేవనెత్తుతుందో, ఏ అంశాలను ప్రస్తావిస్తోందో అనే టెన్షన్ నరేంద్రమోడీలో పెరిగిపోవటం ఖాయం. మరి చివరకు ఏమి జరుగుతుందో చూడాల్సిందే.