జడ్జిలతో జగన్ తీరు అలానా? – ఆర్కే రాతలతో కొత్త చర్చ

మీడియా యజమానిగా వ్యవహరిస్తూ.. ప్రతి వారాంతంలో తనదైన శైలిలో రాజకీయ విశ్లేషణ చేయటం ఆంధ్రజ్యోతి ఎండీ ఆర్కేకు అలవాటైన విషయమే. తాజాగా ఆయన రాసిన కొత్త పలుకులోని అంశాలు రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారాయి. ఇప్పటికే ఆర్కే తీరుపై కత్తులు నూరుతున్నాయి జగన్ వర్గం. ఇటీవల కాలంలో ఆ పత్రికలో వచ్చిన కథనాలు ఏపీలో పెను సంచలనంగా మారటం.. వీటిపై ఏపీ సర్కారు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. నోటీసులు జారీ చేయటం తెలిసిందే.

ప్రభుత్వానికి.. న్యాయవ్యవస్థకు మధ్య అంతరాన్ని పెంచేలా ఆంధ్రజ్యోతి కథనాలు ఉన్నాయన్నది జగన్ పార్టీ నేతలు.. కార్యకర్తలు.. సానుభూతిపరుల వాదన. ఇదిలా ఉంటే.. తన తాజా విశ్లేషణలో జగన్ వ్యక్తిత్వాన్ని దెబ్బ తీసేలా.. జడ్జిల విషయంలో ఆయన తీరు ఏ మాత్రం బాగోదన్న రీతిలో రాసిన రాతలపై మండిపడుతున్నారు. ఏపీ సీఎం జగన్ మీద కావాలనే ఈ తరహా విశ్లేషణలు చేస్తున్నట్లుగా వారంటారున్నారు. తన రాతలతో తట్టెడు బురద వేయటం ద్వారా.. కడుక్కోవాల్సిన పనిని జగన్ మీద వేసేలా ఆర్కే రాతలు ఉన్నట్ులగా మండిపడుతున్నారు.

ఇంతకీ.. ఆర్కే ఏమేం రాశారు? అన్నదిప్పుడు ఆసక్తికరంగా మారింది. తనకు తెలిసిన సోర్సు ద్వారా విషయాల్ని సేకరిస్తున్నట్లుగా పేర్కొంటూ న్యాయమూర్తుల విషయంలో జగన్ తీరు కాస్త అతిశయంతో పాటు.. అవసరానికి మించిన ఆత్మవిశ్వాసాన్ని ప్రదర్శించేలా ఉందని పేర్కొన్నారు. ఆయనేం వ్యాఖ్యలు చేశారంటే..

“న్యాయ వ్యవస్థతో చెలగాటమాడటం జగన్‌ రెడ్డికి సరదాగా ఉంటోంది. ఇప్పటి వరకూ పనిచేసిన ముఖ్యమంత్రులు అందరూ న్యాయమూర్తులతో గౌరవంతో మెలిగేవారు. కొన్ని సందర్భాలలో ముఖ్యమంత్రులు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తులను కలసి రాష్ట్రంలో పరిస్థితులను బ్రీఫ్‌ చేయడం చూశాం. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఇప్పటికీ ఈ సంప్రదాయాన్ని అనుసరిస్తున్నారు. ఏపీ ముఖ్యమంత్రి జగన్‌కు మాత్రం ఇటువంటి సున్నితమైన అంశాలపై ఆసక్తి ఉన్నట్టు కనిపించదు. న్యాయ వ్యవస్థతో ఘర్షణకే ఆయన ప్రాధాన్యం ఇస్తున్నారు”

ఇలా ముఖ్యమంత్రి జగన్ తో పాటు.. ఆయన పార్టీకి చెందిన నేతలు న్యాయమూర్తులతో వ్యవహరిస్తున్న తీరు ఆశ్చర్యానికి కారణంగా మారిందంటూ ఆర్కే విశ్లేషణ కొత్త కలకలానికి గురవుతుంది. తాము ఎంత మౌనంగా ఉన్నా.. ఏదోలా తమను.. తమ నాయకుడ్ని కెలకటంపై జగన్ వర్గాలు తీవ్ర ఆగ్రహంతో ఉన్నాయి. మరీ.. విమర్శలకు.. ఆరోపణలకు సీఎం జగన్ ఏ రీతిలో స్పందిస్తారో చూడాలి.