టెక్క‌లి టాక్‌: ఎవ‌రికైనా చెమ‌ట‌లు ప‌ట్టాల్సిందేనా?

వ‌చ్చే ఎన్నిక‌ల‌ను సీరియ‌స్‌గా తీసుకున్న ఏపీలోని ప్ర‌ధాన ప‌క్షాల‌కు.. కొన్నికొన్ని నియోజ‌క‌వ‌ర్గాలు టెస్టులు పెడుతున్నాయి. ఇలాంటి వాటిలో ఉమ్మ‌డి శ్రీకాకుళం జిల్లాలోని టెక్క‌లి నియోజ‌క‌వ‌ర్గం ఒక‌టి. ఇక్క‌డ నుం చి ప్ర‌స్తుతం టీడీపీ ఏపీ అధ్య‌క్షుడు, మాజీ మంత్రి కింజ‌రాపు అచ్చెన్నాయుడు ప్రాతినిథ్యం వ‌హిస్తున్నారు. ఈయ‌న ఇక్క‌డ నుంచి 2014, 2019 ఎన్నిక‌ల్లో అచ్చెన్నాయుడు విజ‌యం సాధించారు. నిజానికి గ‌త ఎన్నిక‌ల్లోనే వైసీపీ ఆయ‌న‌ను ఓడించేందుకు ప్ర‌య‌త్నించింది.

అయిన‌ప్ప‌టికీ.. టెక్క‌లిలో అచ్చెన్న గెలుపు వ‌రుస‌గా సాగింది. ఇక‌, వ‌చ్చే ఎన్నిక‌ల్లో వైసీపీ అధికారంలోకి వ‌చ్చినా.. రాకున్నా..(ఈ మాట అంత‌ర్గ‌త చ‌ర్చ‌ల్లో వినిపిస్తుంది) కొన్ని నియోజ‌క‌వ‌ర్గాల్లో టీడీపీని ఓడిస్తే.. గెలిచినంత ఆనందం పొందుతార‌నే చ‌ర్చ సాగుతోంది. ఇలాంటి వాటిలో కుప్పం, ప‌రుచూరు, అద్దంకి, పాల‌కొల్లు, హిందూపురం నియోజ‌క‌వ‌ర్గాలు స‌హా టెక్కలి కూడా ఉంది. దీనికి కార‌ణం.. వైసీపీని నిత్యం టార్గెట్ చేస్తున్న అచ్చెన్న‌ను ఓడించి.. ఇంటికి ప‌రిమితం చేయాల‌నేది వైసీపీ వ్యూహం.

ఈ నేప‌థ్యంలోనే ఇక్కడ నుంచి గ‌త ఎన్నిక‌ల్లో వైసీపీ త‌ర‌పున పోటీ చేసి ప‌రాజ‌యం పాలైన పేరాడ తిల‌క్‌ను ప‌క్క‌న పెట్టి.. మ‌రో యువ నేత‌ దువ్వాడ శ్రీనివాస్‌కు టికెట్ ఇస్తున్న‌ట్టు కొన్నాళ్ల కింద‌టే సీఎం జ‌గ‌న్ ప్ర‌క‌టించారు. ఆయ‌న కూడా దూకుడు పెంచారు. అయితే, పేరాడ తిల‌క్ ఎక్క‌డ ఎగ‌స్పార్టీ అవుతారోన‌నే ఉద్దేశంతో వ్యూహం మార్చుకుని దువ్వాడ సతీమ‌ణికి ఇక్క‌డ టికెట్ ఇస్తున్న‌ట్టు ప్ర‌క‌టించారు. స‌రే.. ఏదేమైనా.. వైసీపీ అయితే.. గ‌ట్టి ప్ర‌య‌త్నాలే చేస్తోంది.

ఈ నేప‌థ్యానికి తోడు జ‌న‌సేన కూడా ఇక్క‌డ స్పీడ్ పెంచింది. త‌ర‌చుగా ప‌వ‌న్ శ్రీకాకుళం వ‌స్తుండ‌డం.. టెక్క‌లి విష‌యాల‌ను ప్ర‌స్తావించ‌డంతో జ‌న‌సేన అభిమానులు కూడా పెరుగుతున్నారు. గ‌త ఎన్నిక‌ల్లో ఇక్క‌డ జ‌న‌సేన‌కు డిపాజిట్లు ద‌క్క‌లేదు. కానీ, ఇప్ప‌డు ఆ ప‌రిస్థితి లేద‌ని అంటున్నారు. ఈ నేప‌థ్యంలోనే ఇక్క‌డ వ‌చ్చే ఎన్నిక‌ల్లో మ‌రింత పోటీ పెరుగుతుంద‌ని.. ఎవ‌రు గెలిచినా.. వంద‌ల ఓట్ల తేడాతోనే గెలుపు గుర్రం ఎక్కాల్సి ఉంటుంద‌ని అంచ‌నా వేస్తున్నారు. అంతేకాదు.. చెమ‌ట చిందిస్తే.. త‌ప్ప‌.. గెలుపు సాధ్యం కాద‌ని విశ్లేష‌కులు లెక్క‌లు వేస్తున్నారు. మ‌రి ఏం జ‌రుగుతుందో చూడాలి.