జగన్ గర్జిస్తే లోకేష్ లాగులో పోసుకోవాలి: అంబటి

ఏపీ సీఎం జగన్ పై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. జగన్‌కు భయం అంటే ఏంటో పరిచయం చేస్తా అంటూ లోకేష్ చేసిన కామెంట్లు కాక రేపుతున్నాయి. ఈ నేపథ్యంలోనే లోకేష్ పై మంత్రి అంబటి రాంబాబు ప్రతి విమర్శలు గుప్పించారు. జగన్ గర్జిస్తే లోకేష్ లాగులో పోసుకోవాలి అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలుగు అకాడమీ చైర్‌పర్సన్‌ లక్ష్మీపార్వతి రచించిన ‘అల్లుడు సుద్దులు’ పుస్తకావిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్న అంబటి ఈ వ్యాఖ్యలు చేశారు. టీడీపీకి పట్టిన శని లోకేష్‌ అని, లోకేష్‌ పేరు మీద టీడీపీ గంగలో కలిసిపోతుందని ఎద్దేవా చేశారు.

లక్ష్మీపార్వతి భుజంపై తుపాకీ పెట్టి ఎన్టీఆర్ ను బాబు కాల్చేశారని ఆరోపించారు. చంద్రబాబు పూర్తి నిజస్వరూపం లక్ష్మీపార్వతికి తెలియకపోయినా…ఆయన బావమరిదికి తెలుసంటూ షాకింగ్ కామెంట్లు చేశారు. బంధుత్వాలను, డబ్బును వాడుకుని రాజకీయాల్లోకి చంద్రబాబు వచ్చారని ఆరోపించారు. ఎన్టీఆర్ భోళాశంకరుడని, ఎవరిని నిలబెట్టైనా గెలిపించగల సమర్థుడని, ఆ లక్షణం వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డికి, జగన్‌ కు వచ్చిందని వెల్లడించారు. అధికారం కోసం బాబు ఎవరితో అయినా కలుస్తాడని, ఆయన దత్తపుత్రుడు కూడా అందరితో కలిశాడని ఎద్దేవా చేశారు. చంద్రబాబును ముఖ్యమంత్రిని చేయడానికి పవన్ నానా గడ్డి కరుస్తున్నాడని సెటైర్లు వేశారు.

ఏదోలా ప్యాంటు షర్డు వేసి లోకేష్ ని సీటులో కూర్చోబెట్టాలని చంద్రబాబు చూస్తున్నాడని ఎద్దేవా చేశారు. లోకేష్ తో చేరి దత్తపుత్రుడు (పవన్‌ కల్యాణ్‌) పాడైపోతున్నాడని, రోజుకు 2 కోట్లు సంపాదించే పవన్.. ట్యాక్స్ కడుతున్నాడో లేదో? అని అనుమానం వ్యక్తం చేశారు. మావాడు సీఎం అవుతాడనని మా కులపోళ్లు అనుకుంటున్నారని, కానీ, పవన్ నాశనం అవ్వడమే కాకుండా సినిమా పిచ్చితో ఉన్న యువకులను నాశనం చేస్తున్నాడని ఆవేదన వ్యక్తం చేశారు. త్వరలో పవన్ పై కూడా పుస్తకం రాసి ఆయనకు పంపించాలని లక్ష్మీపార్వతిని కోరారు.