మోడీ ఇంత భయపడుతున్నారా ?

మణిపూర్లో అల్లర్లపై పార్లమెంటులో చర్చించేందుకు నరేంద్రమోడీ ఎంత భయపడుతున్నారో అర్ధమవుతోంది. రెండున్నర నెలలుగా మణిపూర్లో ఎంతటి ఘోరాలు జరుగుతున్నాయో అందరు చూస్తున్నదే. ఒకవైపు రాష్ట్రం అట్టుడికిపోతున్నా, ఘోరాలు జరుగుతున్నా మోడీ ఏమాత్రం పట్టించుకోకుండా హ్యాపీగా విదేశాల్లో తిరిగొచ్చారు. అంతర్జాతీయస్ధాయిలో దేశంపరువు పోయినా మోడీ లెక్కచేయలేదు. ఆ దశలన్నీ దాటిపోయి ఇపుడు మొదలైన వర్షాకాల సమావేశాల్లో ఇదే అంశాన్ని చర్చించాలంటే కేంద్రప్రభుత్వం ఇష్టపడటంలేదు.

పార్లమెంటులో చర్చజరిగితే ప్రతిపక్షాల ప్రశ్నలకు సమాధానం చెప్పుకోవాలంటేనే మోడీ భయపడుతున్నారు. ఇదే విషయమై పార్లమెంటులో ప్రతిపక్షాలు రెండు అంశాలను డిమాండ్ చేస్తున్నాయి. మొదటిదేమో మణిపూర్ ఘటనలపై ప్రత్యేకంగా చర్చ జరగాలని. రెండోదేమిటంటే ఇదే విషమమై మోడీయే ఒక ప్రకటనచేయాలని. చర్చకు ఎందుకు అనుమతించటంలేదో, ప్రకటనచేయటానికి మోడీ ఎందుకు ముందుకు రావటంలేదో ఎవరికీ అర్ధంకావటంలేదు.

రెండున్నర మాసాలుగా మణిపూర్లో అల్లర్లు జరుగుతుంటే మోడీ పట్టించుకున్నట్లే కనబడలేదు. అంతర్గతంగా నివేదికలు తెప్పించుకుని హోంశాఖ, రాష్ట్రప్రభుత్వంతో చర్చలు జరిపి సమీక్షలు జరిపుండవచ్చు. అయితే ఆ విషయం దేశంమొత్తానికి ఎలాగ తెలుస్తుంది ? అందరికీ తెలియాలంటే మీడియా సమావేశం లేదా ఒక ప్రకటన లాంటివి చేస్తేనే కదా తెలిసేది. మణిపూర్లో అమానవీయ ఘటనలు జరుగుతుంటే కూడా తనకేమీ పట్టనట్లు మోడీ వ్యవహరిస్తుంటే అర్ధమేంటి ? పైగా రాష్ట్రంలో పర్యటించాలని అనుకున్న రాహుల్ గాంధి, ప్రతిపక్షాల నేతలను అంగీకరించలేదు. తానూ పర్యటించక, ప్రతిపక్షాలనూ పర్యటించటానికి ఒప్పుకోకపోతే ఏమిటర్ధం ?

పోనీ ఇపుడు పార్లమెంటులో చర్చిస్తారా అంటే అదీలేదు. విపక్షాలేమో ప్రత్యేక చర్చ జరగాలంటే ప్రభుత్వమేమో అర్ధగంట మాత్రమే కేటాయించింది. మణిపూర్లో రెండున్నర నెలల అల్లర్లు, అమానవీయ ఘటనలను చర్చించేందుకు కేంద్రప్రభత్వం అర్ధగంట మాత్రమే కేటాయించిందంటేనే ఎంతగా భయపడుతోందో అర్ధమైపోతోంది. ప్రతిపక్షాల డిమాండ్ల ప్రకారం ప్రత్యేకచర్చ జరిగితే తన బండారం బయటపడుతుందని మోడీ భయపడుతున్నట్లున్నారు. అందుకనే ప్రతిపక్షాలు ఎంతగా డిమాండ్ చేసినా ఎన్డీయే అంగీకరించలేదు. చివరకు అధికార-ప్రతిపక్షాల గోలతో ఎలాంటి చర్చలు జరగకుండానే సమావేశాలు ముగిసిపోవటం ఖాయమనిపిస్తోంది. మోడీకి కావాల్సింది కూడా ఇదేనా ?