యామినిపై కేసు…సోము వీర్రాజు ఆన్ ఫైర్

ఏపీ బీజేపీ మహిళా నేత సాధినేని యామిపై కేసు నమోదైన సంగతి తెలిసిందే. ఇటీవల జరిగిన అయోధ్య రామాలయ నిర్మాణం భూమిపూజ ప్రత్యక్ష ప్రసారం చేయలేదని టీటీడీపై యామిని అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ ఆమెపై టీటీడీ విజిలెన్స్ విభాగం తిరుమల టూటౌన్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో, సాధినేని యామినిపై ఐపీసీ సెక్షన్ 505(2), 500 కింద పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ నేపథ్యంలోనే తాజాగా యామినిపై కేసు నమోదు చేయడాన్ని ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు ఖండించారు. ఆ కేసును ఉపసంహరించుకోవాలని సోము వీర్రాజు డిమాండ్ చేశారు. అయోధ్య లో రామ మందిరం శంకుస్థాపన శతాబ్దల కల అని, ఈ కార్యక్రమాన్ని ప్రపంచంలోని 250 చానెల్స్ ప్రత్యక్ష ప్రసారం చేశాయని సోము వీర్రాజు ట్వీట్ చేశారు. అటువంటిది కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి కొలువున్న టీటీడీకి చెందిన ఎస్వీబీసీ ఆ కార్యక్రమాన్ని ప్రసారం చేయలేదని, అది మనసుకు బాధ కలిగించిందని ఆవేదన వ్యక్తం చేశారు.

ఈ వ్యవహారంలో సాదినేని యామిని గారి మీద కేస్ పెట్టడం మంచిది కాదని, కేసును వెంటనే ప్రభుత్వం ఉపసంహరించుకోవాలని సోము వీర్రాజు ట్వీట్ చేశారు. యామినిపై కేసు వ్యవహారంలో పార్టీ అధ్యక్షుడిగా సోము వీర్రాజు స్పందించిన తీరు బాగుందని చెప్పవచ్చు. అయోధ్య వంటి సున్నితమైన వ్యవహారంలో యామినిపై కేసు పెట్టడాన్ని వీర్రాజు ఖండించి తమ నేతలకు అండగా ఉన్నామనే సంకేతాలు పంపారు. పార్టీ అధ్యక్షుడిగా వీర్రాజు ఈ వ్యవహారంలో సరైన వాదనే వినిపించారన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. యామిని చేసిన ఆ వ్యాఖ్యలు ఆమె వ్యక్తిగతం అని వదిలేయకుండా…ఆమెకు బాసటగా నిలవడంపై బీజేపీ శ్రేణులు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. కాగా, అయోధ్య రామమందిర శంకుస్థాపన సమయంలో ఎస్వీబీసీలో స్వామివారి కల్యాణోత్సవం ప్రత్యక్ష ప్రసారమవుతోందని, ఆ సమయంలో ఏ ఇతర కార్యక్రమాన్ని ప్రసారం చేయడం లేదని, అందుకే అయోధ్యలో రామ మందిరం శంకుస్థాపన కార్యక్రమాన్ని ప్రత్యక్ష ప్రసారం చేయలేకపోయామని టీటీడీ వివరణ ఇచ్చింది.

మరి, సోము వీర్రాజు డిమాండ్ పై జగన్ సర్కార్, టీటీడీ స్పందన ఎలా ఉండబోతోందన్నది ఆసక్తికరంగా మారింది.