వివేకా కేసులో ర‌హ‌స్య సాక్షి ఎవ‌రంటే.. సీబీఐ వెల్ల‌డి

ఏపీ సీఎం జ‌గ‌న్ చిన్నాన్న‌, మాజీ మంత్రి వివేకానంద‌రెడ్డి దారుణ హ‌త్య‌కు సంబంధించి.. త‌మ వ‌ద్ద ర‌హ‌స్య సాక్షి ఇచ్చిన వాంగ్మూలం ఉంద‌ని.,. అదే కేసును కీల‌క మ‌లుపు తిప్పింద‌ని గ‌తంలో సీబీఐ తెలిపిన విష‌యం తెలిసిందే. అయితే.. అప్ప‌ట్లో ర‌హ‌స్య సాక్షి ఎవ‌రు? అంటూ.. అనే క‌థ‌నాలు తెర‌మీదికి వ‌చ్చాయి. వైఎస్ రాజ‌శేఖ‌ర‌రెడ్డి కుమార్తె ష‌ర్మిల అని.. కాదుకాదు.. ఆయ‌న బంధువుల‌ని ఇలా అనేక క‌థ‌నాలు తెర‌మీదికి వ‌చ్చాయి.

అయితే.. తాజాగా సీబీఐ స‌మ‌ర్పించిన ఛార్జిషీట్‌లో వెల్ల‌డించిన వివ‌రాల ప్ర‌కారం ర‌హ‌స్య సాక్షి ఎవ‌ర‌నేది తాజాగా బ‌ట్ట‌బ‌య‌లైంది. ఆయ‌న వైసీపీ మండ‌ల స్థాయి నాయ‌కుడు, కొమ్మా శివ‌చంద్రారెడ్డి. ఈయ‌న ప్ర‌స్తుతం వైసీపీలోనే ఉన్నారు. పులివెందుల నియోజ‌క‌వ‌ర్గం సింహాద్రిపురం మండ‌లం వైసీపీ క‌న్వీన‌ర్‌గా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. అయితే.. ఈయ‌న వైఎస్ వివేకానంద‌రెడ్డికి స‌న్నిహితుల‌ని సీబీఐ పేర్కొంది. త‌ర‌చుగా వీరు పార్టీల‌కు అతీతంగా క‌లుస్తుంటార‌ని చార్జి షీటులో స్ప‌ష్టం చేసింది.

శివ‌చంద్రారెడ్డి ఇచ్చిన వాంగ్మూలం ఇదే..

‘‘2018 అక్టోబరు 1న వివేకానంద‌రెడ్డి మా ఇంటికి వ‌చ్చారు. ఆయ‌నకు నాకు స్నేహం ఉంది. ఇది పార్టీల‌కు అతీతం. ఆయ‌న ఏపార్టీలో ఉన్నా.. నేను ఏ పార్టీలో ఉన్నా.. త‌ర‌చుగా క‌లుసుకుంటాం. కుటుంబ వ్య‌వ‌హారాల గురించి కూడా చ‌ర్చించుకుంటాం. ఆయ‌న ఆ రోజు మా ఇంటికి వ‌చ్చి వైసీపీని వీడొద్దని నన్ను కోరారు. అవినాష్ రెడ్డి, శివశంకర్‌రెడ్డితో పనిచేయలేనని నేను క‌రాఖండీగా ఆయ‌న‌కు చెప్పాను“ అని వివ‌రించారు.

ఇదేస‌మ‌యంలో 2019 ఎన్నిక‌ల్లో టికెట్ల ప్ర‌స్తావ‌న వ‌చ్చిందని కొమ్మా శివ‌చంద్రారెడ్డి వెల్ల‌డించారు. “ అవినాష్ రెడ్డికి జమ్మలమడుగు ఎమ్మెల్యే టికెట్ ఇవ్వనున్నట్లు వివేకానంద‌ చెప్పారు. కడప ఎంపీగా విజయమ్మ లేదా షర్మిల పోటీ చేస్తారని అన్నారు. ఈ విష‌యంపై పార్టీ అధినేత జగన్మోహన్‌ రెడ్డితో కూడా మాట్లాడినట్లు చెప్పారు. అయితే.. త‌ర్వాత ఏం జ‌రిగిందో తెలిసిందే.’’ అని శివచంద్రారెడ్డి వాంగ్మూలం ఇచ్చారు. తాను 2018 అక్టోబరు 1 వరకు సింహాద్రిపురం మండల కన్వీనర్‌గా ఉన్నట్లు శివచంద్రారెడ్డి వెల్లడించారు.

ఎవ‌రీ శివ‌చంద్రారెడ్డి!

శివ‌చంద్రారెడ్డి.. వైఎస్ కుటుంబానికి చిన్న‌నాటి మిత్రుడిగా పేర్కొంటారు. రాజ‌శేఖ‌ర‌రెడ్డికి అనుంగు మిత్రుడిగా కూడా స్థానికులు చెబుతారు. ఈయ‌న వైఎస్ కుటుంబానికి సన్నిహితంగా ఉంటార‌ని, ముఖ్యంగా వైఎస్ సీఎం అయ్యాక‌.. ఆయ‌న వివేకాతో ప‌రిచ‌యం పెంచుకుని.. వ్య‌క్తిగ‌త విష‌యాలు కూడా చెప్పేవార‌ని స్థానికులు చెబుతున్నారు. ఇక‌, కాంగ్రెస్ నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చాక‌.. ఆయ‌న వైసీపీలో చేరార‌ని.. అయితే.. ఈయ‌న‌కు మండ‌ల‌స్థాయిలో ప‌ద‌వి ద‌క్కినా.. నామినేటెడ్ ప‌ద‌వి ద‌క్క‌క‌పోవ‌డంతో అలిటి.. 2018 అక్టోబరు 2న వైసీపీ నుంచి టీడీపీలో చేరారు. అయితే.. ఇక్క‌డ కూడా ఆయ‌న కోరుకున్న పులివెందుల మార్కెట్ క‌మిటీ ప‌ద‌వి ద‌క్క‌క‌పోవ‌డంతో తిరిగి 2020 జూన్‌లో వైసీపీలో చేరారు.