ఈరోజు పార్లమెంటు- ఈసారి అన్నీ హాట్ టాపిక్సే

గురువారం నుండి మొదవ్వబోయే పార్లమెంటు వర్షాకాల సమావేశాల్లో మంటలు తప్పేట్లు లేదు. ఒకవైపు ఎన్డీయే మరోవైపు కొత్తగా ఏర్పాటైన ఇండియా కూటమి మధ్య మంటలు పెట్టబోతోంది. ఈ సమరానికి పార్లమెంటు వేదిక కాబోతోంది. కొత్తగా ఏర్పాటైన కూటమి ఇండియా తమ సత్తాను చాటాలని పార్లమెంటు సమావేశాలను ఉపయోగించుకోబోతోంది. ఇంతకీ విషయం ఏమిటంటే ఈ సమావేశాల్లోనే కేంద్రప్రభుత్వం రెండు వివాదాస్పదమైన బిల్లులను ప్రవేశపెడుతోంది.

అవేమిటంటే మొదటిది కామన్ సివిల్ కోడ్ బిల్లు. ఇక రెండోదేమిటంటే ఢిల్లీ ప్రభుత్వంపై పెత్తనం ఎవరిదనే బిల్లు. నిజానికి ఢిల్లీపై పెత్తనం ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వానిదే అని సుప్రింకోర్టు తేల్చిచెప్పింది. అయినా నరేంద్రమోడీ అంగీకరించటంలేదు. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ను ఇబ్బంది పెట్టడమే టార్గెట్ గా పావులు కదుపుతున్నారు. సుప్రింకోర్టు తీర్పుపై మొక్కుబడిగా రివ్యూ పిటీషన్ దాఖలుచేశారు. వెంటనే ఢిల్లీపై కేంద్రప్రభుత్వానికే అధికారం ఉండేట్లుగా ఆర్డినెన్స్ జారీచేశారు. దానికి చట్టబద్ధత కల్పించేందుకు ఇపుడు పార్లమెంటులో బిల్లు పెడుతున్నారు.

ఈ బిల్లును వ్యతిరేకించాల్సిందిగా కేజ్రీవాల్ ప్రతిపక్షాల మద్దతుకోరుతున్నారు. సరిగ్గా ఈ సమయంలోనే ప్రతిపక్షాల్లో మెజారిటి పార్టీలు కలిసి ఇండియా అనే కొత్త కూటమిగా ఏర్పడ్డాయి. అయితే కూటమి కొత్తదే కానీ పార్టీ బలాల్లో మాత్రం మార్పుండదు కదా. అందుకనే బిల్లును ప్రతిపక్షాలు అడ్డుకునే అవకాశాలు తక్కువ. వైసీపీ, బీజూ జనతాదళ్ సాయంతో ఎన్డీయే బిల్లును ఈజీగా పాస్ చేయించుకుంటుంది.

ఈ నేపధ్యంలోనే బిల్లుపై గొడవలు జరిగే అవకాశాలున్నాయి. ఇదే సమయంలో మరో వివాదాస్పద బిల్లు కామన్ సివిల్ కోడ్ కూడా రెడీ అవుతోంది. దీని విషయంలో పార్లమెంటులో మంటలు రేగడం ఖాయంగా కనిపిస్తోంది. ఈ బిల్లు కూడా ఆమోదంపొందే అవకాశాలు ఎక్కువగానే ఉన్నాయి. అయినా సరే తమ నిరసన తెలపాలని, సత్తా చాటాలని ఇండియా కూటమి గట్టిగా డిసైడ్ అయ్యింది. అందుకనే సమావేశంలో బిల్లులపై చర్చ సందర్భంగా మంటలు పుట్టడం ఖాయమని తేలిపోయింది. బిల్లులు ఏరోజు చర్చకు వస్తాయి, నరేంద్రమోడీ ఏమిచేస్తారో చూడాలి.