ఏపీ ప్ర‌జ‌లు మార్పు కోరుతున్నారు.. అమిత్ షాకు ప‌వ‌న్ వెల్ల‌డి

ఢిల్లీ ప‌ర్య‌ట‌న‌లో ఉన్న జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్.. తాజాగా బుధ‌వారం రాత్రి పొద్దు పోయాక కేంద్ర హోం మంత్రి, బీజేపీ అగ్ర‌నేత అమిత్ షాతో భేటీ అయ్యారు. ఈ భేటీలో పార్టీ పీఏసీ చైర్మ‌న్ నాదెండ్ల మ‌నోహ‌ర్ కూడా పాల్గొన్నారు. దాదాపు గంట సేపు సాగిన ఈ భేటీలో రాష్ట్రంలో నెల‌కొన్న ప‌రిణామాల‌ను ప‌వ‌న్ క‌ళ్యాణ్‌.. అమిత్ షా కు పూస‌గుచ్చిన‌ట్టు వివ‌రించార‌ని తెలిసింది. ముఖ్యంగా ఇటీవ‌ల తాను చేప‌ట్టిన వారాహి యాత్ర 1.0, 2.0ల గురించి వివ‌రించార‌ని ఢిల్లీ వ‌ర్గాలు చెబుతున్నాయి.

ఆయా యాత్ర‌ల‌కు ప్ర‌జ‌ల నుంచి వ‌చ్చిన స్పంద‌న‌ను ప‌వ‌న్ క‌ళ్యాణ్ వీడియోలు స‌హా వివ‌రించార‌ని తెలిసింది. ప్ర‌స్తుతం ఏపీ ప్ర‌జ‌లు మార్పు కోరుతున్నార‌ని ఈ విష‌యం త‌న స‌భ‌ల‌కు వ‌చ్చిన ప్ర‌జ‌ల ద్వారా తాను నేరుగా విన్నాన‌ని చెప్పారు. అదేస‌మ‌యంలో కేంద్రం ఇస్తున్న నిధుల‌ను రాష్ట్ర ప్ర‌భుత్వం ప‌క్క‌దారి ప‌ట్టిస్తోంద‌ని, అస‌లు ఆ నిధులు ఏం చేస్తున్నారో కూడా తెలియ‌డం లేద‌ని వివ‌రించిన‌ట్టు స‌మాచారం. ప్ర‌తిప‌క్షాల‌పై పోలీసులు అన‌వ‌స‌రంగా కేసులు పెడుతున్నార‌ని.. క‌నీసం భావ స్వేచ్ఛ కూడా లేకుండా పోయింద‌ని, రాజ్యాంగాన్ని కాద‌ని వ్య‌వ‌హ‌రిస్తున్నార‌ని ప‌వ‌న్ ఫిర్యాదు చేసిన‌ట్టు తెలిసింది.

ఇక‌, వ‌చ్చే ఎన్నిక‌ల్లో పొత్తుల విష‌యం కూడా ప‌వ‌న్‌-అమిత్‌షాల మ‌ధ్య చ‌ర్చ‌కు వ‌చ్చిన‌ట్టు తెలిసింది. అయితే.. ప్ర‌స్తుతం త‌మ దృష్టి తెలంగాణ‌, రాజ‌స్తాన్‌ల‌పై ఉంద‌ని.. త్వ‌ర‌లోనే మ‌రోసారి క‌లిసి మాట్లాడుదామ‌ని అమిత్ షా చెప్పిన‌ట్టు ఢిల్లీ వ‌ర్గాలు చెబుతున్నాయి. ఇదిలావుంటే.. అమిత్ షాతో భేటీకి సంబందించి ప‌వ‌న్ ట్వీట్ చేశారు. “హోంమంత్రి ‘అమిత్ షా జీ’తో అద్భుతమైన సమావేశం జరిగింది. పరస్పర చర్చలు ఆంధ్రప్రదేశ్ ప్రజలకు నిర్మాణాత్మక, నిర్ణయాత్మక, సుసంపన్నమైన భవిష్యత్తుకు నాంది పలుకుతుందని నేను ఖచ్చితంగా భావిస్తున్నా” అని ప‌వ‌న్ ట్విట్ట‌ర్ ద్వారా పేర్కొన్నారు.