పాస్ ఉంటేనే పవన్ దర్శనమా ?

ఇకపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ ను ఎవరైనా కలవాలంటే కచ్చితంగా పాస్ ఉండాల్సిందే. పవన్ను కలవాలంటే అందరికీ అని కాదు పార్టీలోని నేతలకు మాత్రమే. ఎందుకంటే పవన్ను కలవాలని అనుకుంటున్న ముఖ్యనేతలకు అభిమానుల తాకిడి విపరీతంగా పెరిగిపోతోందట. దాంతో నేతలు పవన్ను కలవటం గగనమైపోతోంది. అందుకనే కొత్తగా పాస్ విధానాన్ని తెచ్చారు. తణుకులో జరిగిన పార్టీ నేతల సమావేశంలో కూడా వీరమహిళలకు ఇలాంటి పాస్ లను ముందుగానే జారీచేశారు.

పాస్ లను చూపించిన వీరమహిళలను మాత్రమే పవన్ తో భేటీకి భద్రతాసిబ్బంది అనుమతించిందట. ఇంతకీ విషయం ఏమిటంటే సినీ హీరోల్లో పవన్ కు మాత్రమే విపరీతమైన ఫ్యాన్ బేసుంది. పవన్ ఎక్కడ నిలబడినా చాలు పవన్ వచ్చారని తెలిస్తే చాలు అభిమానులు విపరీతంగా చేరిపోతారు. దానికితోడు రాజకీయాల్లో కూడా ప్రవేశించటంతో పవన్ రెగ్యులర్ గా జనాల్లో తిరగక తప్పటంలేదు. ఇపుడు వారాహియాత్రతో పశ్చిమగోదావరిలో పర్యటిస్తున్న విషయం తెలిసిందే.

వారాహియాత్ర పేరుతో తమ దగ్గరకు వస్తున్నారు కాబట్టి పవన్ను చూడటానికి అభిమానులు విపరీతంగా పోటెత్తుతున్నారు. ఈ సమయంలో ఎక్కడిక్కడ నేతలతో సమీక్షా సమావేశాలు పెట్టుకోవాలంటే పవన్ కు కష్టంగా ఉంది. సమీక్ష జరిగే కల్యాణ మండపాలు, ఫంక్షన్ హాళ్ళ చుట్టూ అభిమానులే ఉంటున్నారు. దాంతో లోపలకి రావాలని అనుకుంటున్న నేతలు రాలేకపోతున్నారు. దీంతో ఏమిచేయాలో మొదట్లో పార్టీ బాధ్యులకు అర్ధంకాలేదు. అందుకనే చివరకు పాసుల విదానాన్ని ప్రవేశపెట్టారు.

అయితే పాసులను కూడా డూప్లికేట్ చేసేసి లెక్కకు మించినంత జనాల్లో లోపలకు వచ్చేస్తున్నారట. అందుకనే డూప్లికేట్ కు అవకాశంలేని పద్దతిలో కొత్త పాసులను రెడీచేశారట. రూపాయి నోట డిజైన్లో ఉండే పాస్ లను రెడీ చేవశారట. దీన్ని డూప్లికేట్ చేయటం సాధ్యంకాదని పార్టీ ముఖ్యులు అనుకుంటున్నారట. తణుకులో జరిగిన వీరమహిళల సమావేశంలో ఇలాంటి పాసులను తనిఖీ చేసిన తర్వాతే లోపలకు అనుమతించారట. అంటే పవన్ సమావేశాలకు ఎవరిని అనుమతించాలన్నది ముందుగానే డిసైడ్ చేసి వాళ్ళకి మాత్రమే ఈ పాసులను అందిస్తున్నారు. పాస్ లను చూపించిన వాళ్ళని మాత్రమే సెక్యూరిటి లోపలకు అనుమతిస్తున్నారు. మొత్తానికి పవన్ దర్శనం కావాలంటే పాస్ తప్పనిసరి అయిపోయింది.